RBI Repo Rate : నేటి కాలంలో ఆర్థిక అవసరాల కోసం బ్యాంకు రుణం తీసుకునేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రతి నెలా చాలా మంది ఈఎంఐ ద్వారా ఈ రుణాన్ని చెల్లిస్తారు. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ సవరణలు చేసినప్పుడు ఇలా లోన్లు తీసుకునేవారు ఆందోళనతో కనిపిస్తారు. ఈ రేట్ పెరుగుతుందా? లేదా? అని ఎదురుచూస్తారు. రెపో రేటు పెరిగితే ఈఎంఐ లపై భారం పెరుగుతుంది. తగ్గితే ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. అయితే తాజాగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు లోన్లు తీసుకున్న వారికి ప్రయోజనం కలగనుంది. అదేంటో చూద్దాం..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలుమార్లు వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. తాజాగా కూడా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించింది. ప్రస్తుతం ఉన్న రెపో రేటును 5.25 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న కోట్లాది మంది రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం లభించింది.
రెపో రేటు అనేది బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలానికి రుణాలు ఇచ్చే సమయంలో వసూలు చేసే వడ్డీ రేటు. ఈ రేటును ఆర్బీఐ పెంచితే బ్యాంకులకు నిధుల వ్యయం పెరుగుతుంది. దాంతో బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. అదే రెపో రేటు తగ్గితే బ్యాంకులు తక్కువ వడ్డీకి నిధులు పొందడంతో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది.
దేశంలో ద్రవ్యోల్బణం , ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులను సమీక్షించిన అనంతరం రెపో రేటును మార్చాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూనే ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
ఇప్పుడే హోమ్ లోన్ లేదా ఇతర రుణాలు తీసుకోవాలని భావిస్తున్న వారికి కూడా ఇదే వడ్డీ వాతావరణం కొనసాగుతుంది. బ్యాంకులు ప్రస్తుతం అమల్లో ఉన్న రుణ వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉంది. కాబట్టి కొత్త రుణగ్రహీతలు కూడా ఈఎంఐ తక్షణ మార్పులు ఆశించాల్సిన అవసరం లేదు.