TDP ఏపీలో ఇప్పుడు అత్యంత కీలక నియోజకవర్గం గా మారింది నెల్లిమర్ల. ఎందుకంటే ఈ నియోజకవర్గ పరిధిలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మితమైంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. అయితే అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి ఉండడం, ఆపై చుట్టుపక్కల ఇతర రంగాలు అభివృద్ధి చెందనుండడంతో.. అత్యధిక ఆదాయం వచ్చే ప్రాంతంగా నెల్లిమర్ల మారనుంది. అటువంటి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం పెంచుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ ఇటువంటి నియోజకవర్గాలపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ అధికార టిడిపి కూటమికి చెందిన జనసేన ఎమ్మెల్యే లోకం కళ్యాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం నెల్లిమర్లను టిడిపి కోరుకునే అవకాశం ఉంది. అదే జరిగితే పూసపాటి రాజవంశీయురాలు, విజయనగరం ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు నెల్లిమర్లకు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. విజయనగరం సిటీ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే పరిస్థితి ఉంది.
* సుదీర్ఘకాలం పూసపాటి వంశీయులే..
1978 నుంచి విజయనగరం నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది పూసపాటి కుటుంబం. తొలిసారిగా జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు అశోక్ గజపతిరాజు. నాడు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుతో కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టారు.. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మరోసారి ఎంపీగా పోటీ చేయడంతో ఎమ్మెల్యేగా మీసాల గీతకు అవకాశం ఇచ్చారు. అటువంటి నియోజకవర్గం నుంచి తొలిసారిగా 2019లో పోటీ చేశారు అశోక్ కుమార్తె అతిథి గజపతిరాజు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె 2024 ఎన్నికల్లో మాత్రం రికార్డు స్థాయిలో గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె నెల్లిమర్ల నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది.
* పరస్పర మార్పు తప్పదా..
నెల్లిమర్ల నుంచి జనసేన తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు లోకం మాధవి. నెల్లిమర్ల టిడిపికి బలమైన నియోజకవర్గం. తప్పకుండా గెలిచే సీటు కూడా. అయితే రాష్ట్రస్థాయిలో పొత్తుల నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. టిడిపి మద్దతుతో ఎమ్మెల్యేగా లోకం కళ్యాణి గెలిచారు. అయితే ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఈ కీలకమైన నియోజకవర్గాన్ని టిడిపి తీసుకోవాలని చూస్తోంది . అందుకే అతిథి గజపతి రాజును నెల్లిమర్లకు తెచ్చి.. జనసేన ఎమ్మెల్యే గా ఉన్న లోకం కళ్యాణికి విజయనగరం బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.