Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. ముఖ్యంగా మిత్రపక్షాలు అధికారంలో ఉన్నచోట కొత్తగా ఇంచార్జ్లను ఏర్పాటు చేస్తోంది. ఇటీవల విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జిగా సీనియర్ నేత బుద్ధ వెంకన్నను నియమించింది. కానీ కీలకమైన పి. గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి పదవిని ఇంతవరకు భర్తీ చేయలేదు. దీంతో అక్కడ టిడిపి శ్రేణులు నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాయి. సమన్వయం చేసే నాయకుడు లేక అంతర్గత విభేదాలు పార్టీలో రోజురోజుకు పెరుగుతున్నాయి. నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంది.
* నేతల మధ్య విభేదాలు..
గత కొంతకాలంగా పి గన్నవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి లేరు. అందుకే పార్టీ శ్రేణుల్లో సమన్వయం లేక రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. ఈ నేపథ్యంలో మొన్న ఆ మధ్యన టిడిపి హై కమాండ్ స్పందించింది.. ఇన్చార్జి నియామకానికి కసరత్తు మొదలుపెట్టింది. ఆ జిల్లా ఇన్చార్జిగా ఉన్న మంత్రి కింజరాపు అచ్చెనాయుడు, జోనల్ ఇంచార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ క్యాడర్ తో సమావేశం అయ్యారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఇది జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొత్త నియామకం చేపట్టలేదు. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకు ఇన్చార్జిలు వస్తున్నారు. కానీ పి గన్నవరం నియోజకవర్గానికి మాత్రం ఇంతవరకు ఇంచార్జ్ ను నియమించలేదు.
* ఆశావహులు అధికం..
గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ఇన్చార్జి లేకపోవడం గమనార్హం. రకరకాల కారణాలతో ఇక్కడ ఇన్చార్జిను నియమించలేదు. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో తెలుగుదేశం పార్టీ హై కమాండ్ కు ఎప్పుడు ఇబ్బందికరమే. ప్రస్తుతం ఈ పదవి కోసం మేకా ఆనంద్ సాగర్, మహాసేన రాజేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఆనంద్ సాగర్ గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇన్చార్జ్ పదవిని ఆశిస్తున్నారు. ఇంకోవైపు మహాసేన రాజేష్ సైతం ఇన్చార్జి పదవిని కోరుకుంటున్నారు. ఎన్నికలకు ముందు టిడిపి హై కమాండ్ ఆయనకు టికెట్ ఇచ్చింది. కానీ జనసేన అభ్యంతరాలతో ఆ సీటు వారికి కేటాయించారు. మరోవైపు నేతలు నాగబత్తుల సుబ్బారావు, జాలెం సుబ్బారావు, నక్క సునీల్, నేదునూరి వీర్రాజు తదితరులు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు టిడిపి ఇన్చార్జిలు వస్తున్నారు. కానీ ఈ గన్నవరం విషయంలో మాత్రం హై కమాండ్ నిర్ణయం ప్రకటించడం లేదు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.