
శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవోపై మీ స్టాండ్ ఏమిటి అనేది చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశించారు. అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడతారు. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు మనసు రాలేదా అంటూ ట్వీట్ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల కృష్ణా నీటిని ఎత్తి కుడి ప్రధాన కాల్వలోకి విడుదల చేయడంతో పాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అదేవిధంగా గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను 30 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ నెల 5న జీవో కూడా జారీ చేసింది. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం రాజుకుంది.
దీంతో ఎంపీ విజయ సాయిరెడ్డి శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి అనే విషయాన్ని వెల్లడించాలని కోరారు. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా, బాబూ నువ్వు రాయలసీమ బిడ్డవెనా అంటూ విమర్శలు గుప్పించారు.