Vallabhaneni Vamsi : ఏపీలో ఇప్పుడు గన్నవరం సీటు హాట్ టాపిక్. పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది ఈ నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ హోరాహోరీ ఫైట్ నడవనుంది. దీనంతటికీ వల్లభనేని వంశీ యే కారణం. గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన వంశీ అనూహ్యంగా వైసీపీకి మద్దతు తెలిపారు. దీంతో అప్పటి వరకు ఉన్న వైసిపి నేతలకు కలవరపాటుకి గురి చేశారు. దీంతో వారు ఇప్పుడు సేఫ్ జోన్ ఎంచుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరిపోయారు. మరో వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావు మాత్రం డిఫెన్స్ లో ఉండి పోయారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ 800 ఓట్లతో గట్టెక్కారు. స్వల్ప మెజారిటీతో యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయారు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న యార్లగడ్డ వెంకట్రావుకి పిలిచి మరి జగన్ టికెట్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుట్టా రామచంద్ర రావు ను పక్కన పెట్టి మరి అవకాశం ఇచ్చారు. అయినా సరే ఓటమి ఎదురయ్యింది. అయితే వల్లభనేని వంశీ వైసీపీకి ఎంట్రీ తో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ఈ తరుణంలో యార్లగడ్డ వెంకట్రావు టిడిపి గూటికి చేరారు. దుట్టా రామచంద్ర రావు మాత్రం వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయన్ను జగన్ ప్రత్యేకంగా పిలిచి మరి మాట్లాడారు. త్వరలో శుభవార్త చెబుతానని ప్రకటించారు. దీంతో వల్లభనేని వంశీ డిఫెన్స్ లో పడిపోయారు.
వల్లభనేని వంశీ పై వైసిపి హై కమాండ్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గ పార్టీ శ్రేణులకు వంశీ అందుబాటులో ఉండడం లేదు. అటు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సైతం వెనుకబడి ఉన్నారు. ఇటీవల పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. వార్డు స్థానాల్లో సైతం ఓడిపోయారు. వార్డు స్థానాలను గెలిపించుకోవడంలో వంశీ నిర్లక్ష్యాన్ని హై కమాండ్ సీరియస్ గా తీసుకుందట. అందుకే వచ్చే ఎన్నికల్లో వంశీకి టిక్కెట్ డౌటే నన్న టాక్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ అని వంశీ తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఇది కూడా హై కమాండ్ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో దుట్టా రామచంద్ర రావే వైసీపీ అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో మెజారిటీ కమ్మ సామాజిక వర్గం టిడిపి వెంట నడుస్తోంది. మొన్నటి వరకు యార్లగడ్డ వెంకట్రావు వెనక నడిచిన క్యాడర్ సైతం టిడిపి గూటికి చేరింది. అంతకుముందు వల్లభనేని వంశీ వెంట ఉన్న క్యాడర్ సైతం.. నియోజకవర్గంలో సరైన నాయకుడు లేకపోవడంతో పునరాలోచనలో ఉండేది. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు రూపంలో నాయకత్వం లభించడంతో కమ్మ సామాజిక వర్గం ఏకపక్షంగా టిడిపికి మద్దతు పలుకుతోంది. ఈ పరిణామాలతో వైసిపి హై కమాండ్ కొత్త సమీకరణకు ఆలోచిస్తుంది. దుట్టా రామచంద్రరావు ను అభ్యర్థిగా డిసైడ్ చేస్తారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వల్లభనేని వంశీ పరిస్థితి ఏమిటనేది సర్వత్ర చర్చ నడుస్తోంది.