Homeఆంధ్రప్రదేశ్‌బడ్జెట్ లో ఆకర్షణే తప్ప అభివృద్ధి లేదు: పవన్

బడ్జెట్ లో ఆకర్షణే తప్ప అభివృద్ధి లేదు: పవన్


వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ బడ్జెట్ లో ప్రజాకర్షణే తప్ప అభివృద్ధి లేదన్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెలతో కనికట్టు చేశారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల ఆదాయాన్ని పెంచడానికి చిన్న ప్రయత్నం కూడా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ఆర్ధిక వాస్తవికత, స్పష్టత లోపించాయన్నారు. అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిదని, అది ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా ఎంతో కాలం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేమనే విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరం (2019 – 20 ) బడ్జెట్ ను రూ. 2.27 లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారు. కానీ సవరించిన అంచనాలతో ఆ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసినది రూ.1.74 లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. వాస్తవ బడ్జెట్ అంచనాలకు సవరణలకు తేడా రూ. 53,217.54 కోట్లు వ్యత్యాసం ఉందన్నారు. కీలకమైన వ్యవసాయం, ఇరిగేషన్, గృహనిర్మాణాల, వైద్య ఆరోగ్యం లాంటి శాఖల బడ్జెట్ కు కోతలు విధించారని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలోను అంచనాలు భారీగా చూపారు తప్ప ఆచరణ ప్రణాళికలు కనిపించలేదన్నారు. కొత్త బడ్జెట్ చూసిన తరువాత జనసేన నేతలు, పార్టీకి సేవలు అందిస్తున్న మేధావులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారన్నారు.

అవి:
● రాష్ట్రానికి కొత్తగా ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి?
● ఆంధ్రప్రదేశ్ లోని యువకుల కోసం ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు?
● స్పష్టమైన నూతన పారిశ్రామిక విధానాన్ని ఎందుకు ప్రకటించడం లేదు.
● గడచిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.18,327 కోట్లు మేర ప్రతిపాదనలు చేసి ఎందుకు రూ.5,986 కోట్లకు తగ్గించారు? ఈ బడ్జెట్లో 35శాతం మేరకు ఎందుకు నిధుల ప్రతిపాదనలు తగ్గించారు?
● రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కారణంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పిన మీరు బడ్జెట్లో మాత్రం రాష్ట్రం ఆర్ధికంగా పురోగమిస్తోందని గారడీ మాటలు ఎందుకు చెబుతున్నారు?
● నవరత్నాలను వల్లే వేస్తూ అభివృద్ధిని మరిచిపోయిన మీరు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు?
● గ్రామ వలంటీర్ల నియామకం ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను సృష్టించామని చెబుతున్న ఆర్ధిక మంత్రి గ్రామ వాలంటీర్లందరూ ప్రభుత్వ ఉద్యోగులే అని ప్రకటించగలరా?
● కోవిడ్-19 ఉందని చెప్పి పట్టుమని పది రోజులు కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేని ప్రభుత్వం, లక్షలమంది విద్యార్థులతో పదో తరగతి పరీక్షలు సురక్షితంగా నిర్వహించగలదా? పిల్లల రక్షణపై ప్రభుత్వం చట్టపరమైన హామీని తల్లిదండ్రులకు ఇవ్వగలదా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular