Tirumala: తిరుమలలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వారికి వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు గమనించి సరి చేస్తోంది. అందులో భాగంగా మరో నిర్ణయం తీసుకుంది. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సౌలభ్యం కోసం అల్పాహారంతో పాటు భోజన వసతి కల్పిస్తోంది. పాలతో పాటు తాగునీటిని సైతం అందిస్తోంది. శ్రీవారి సేవకుల ద్వారా క్యూ కంపార్ట్మెంట్ లతో పాటు బహిరంగ క్యూలైన్లలో ఉన్న ప్రతి భక్తుడికి ఆహార పదార్థాలు ఇప్పుడు అందుతున్నాయి. నిజంగా ఇది గొప్ప నిర్ణయం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా వాటిని అందిస్తున్నారు. దీంతో క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తులు ఆకలి అన్నది లేకుండా గడుపుతున్నారు.
* భక్తులకు ఇబ్బంది లేకుండా..
సాధారణంగా శ్రీవారి దర్శనం అంటే గంటల తరబడి తంతు. సాధారణ భక్తుల గురించి చెప్పనవసరం లేదు. క్యూలైన్లలో ఒక్కోసారి రోజుల తరబడి నిల్చునే పరిస్థితి ఉంటుంది. పర్వదినాలతో పాటు ప్రత్యేక రోజుల్లో రద్దీ చెప్పనవసరం లేదు. ఆ సమయంలో క్యూ లైన్ లలో ఉండే భక్తులు ఆకలితో అలమటిస్తుంటారు. అటువంటి వారికి అల్పాహారంతో పాటు ఏకంగా భోజన సదుపాయం సైతం కల్పిస్తుండడం గొప్ప విషయం. చిన్నపిల్లలకు అవసరమైన వాళ్లు కూడా అందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ అల్పాహారం పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కి భోజనం కూడా అందిస్తున్నారు.
* అల్పాహారంతో పాటు భోజనం..
సాధారణంగా టిఫిన్ లో భాగంగా ఉప్మా ఎక్కువగా అందిస్తుంటారు. అదే సమయంలో అటుకులు లేదా ఇతర అల్పాహారం కూడా అందిస్తున్నారు. పాలతో పాటు మజ్జిగ సైతం అందుబాటులో ఉంటుంది. నిరంతరాయంగా తాగునీరు ఎలాను అందుబాటులో ఉంచుతున్నారు. మధ్యాహ్నం తో పాటు రాత్రి వేళల్లో పులిహోర, సాంబారు అన్నం, టమాటా రైస్ అందజేస్తున్నారు. సుమారు 100 మందికి పైగా శ్రీవారి సేవకులు క్యూలైన్లోని భక్తులకు నేరుగా ఆహారాన్ని అందిస్తున్నారు. పరిశుభ్రమైన ఆధునిక వంటశాలలో ఆహారాన్ని తయారుచేసి తిరుమలలో భక్తులకు ఆకలి అన్నది లేకుండా చేస్తుండడం విశేషం. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. ఆలయం సైతం భక్తులతో కిటకిటలాడుతోంది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉండడం కనిపిస్తోంది. గురువారం ఒక్కరోజే శ్రీవారిని 66,842 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,670 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.