Homeఆంధ్రప్రదేశ్‌'బాబు'కు అనుమతి ఇవ్వకపోవడానికి కారణమిదేనా?

‘బాబు’కు అనుమతి ఇవ్వకపోవడానికి కారణమిదేనా?


టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి మార్గం కనిపించడం లేదు. మార్చి 22వ తేదీకి ముందు ఆయన హైదరాబాద్ వెళ్లారు. అనంతరం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఏపీకి రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు రాసినా ఆయన గోడు పట్టించుకున్నవారు లేరు. ఈ నెల 7వ తేదీ విశాఖలో ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి, ప్రధాన మంత్రికి విడివిడిగా లేఖలు రాశారు. ఈ వ్యవహారం రాష్ట్రాల పరిధిలో ఉందని భావించిన కేంద్రం బాబు లేఖపై స్పందించలేదు. అదే రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అనుమతి లభించడంతో ఆయన గుంటూరు నుంచి విశాఖ వెళ్లి భాదితులను పరామర్శించారు.

మూడవ విడత లాక్ డౌన్ సమయంలో రాష్ట్రానికి రావడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ డీజీపీ కి బాబు లేఖ రాశారు. ఆ లేఖపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతం నాల్గవ విడత లాక్ డౌన్ అమలులో ఉన్నందున రాష్ట్రంలో రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని మాత్రం అనుమతి పత్రాలు ఉంటేనే అనుమతిస్తున్నారు. దీంతో చంద్రబాబు సోమవారం విశాఖ వెళ్లి ఎల్.జి భాదితులను పరామర్శించిన అనంతరం అమరావతి చేరుకోవాలని టూర్ ప్లాన్ చేశారు. ఇందుకోసం మరోమారు అనుమతి కోరుతూ ఏపీ, తెలంగాణా డీజీపీలకు లేఖ రాశారు. తెలంగాణా డీజీపీ నుంచి అనుమతి పత్రం మజూరైనా, ఏపీ డిజీపీ నుంచి అనుమతి పత్రం ఇప్పటి వరకూ రాలేదు.

వైసీపీ మంత్రులు ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో ఇంట్లో కూర్చుని విమర్శలు చేసున్నారని చెబుతున్నారు. ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఈ అంశంపై రోజుకో ట్వీట్ చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రానికి వచ్చే సమయంలో అనుమతి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని టీడీపీ నాయకులు వాదిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రానికి వస్తున్నాడంటేనే వైసీపీకి భయం పట్టుకుందనటున్నారు. అందుకే అనుమతి ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అనుమతి ఇవ్వకపోతే నాల్గవ విడత లాక్ డౌన్ ముగిసే (మే నెలాఖరు) వరకూ చంద్రబాబు వచ్చే అవకాశం ఉండదు. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 27న చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రర్యటన సందర్భంగా హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న బాబు కాన్వాయ్ ను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విశాఖను రాజధానిని చేయకుండా అడ్డుపడుతున్నారని వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. సాయంత్రం వరకూ సాగిన ఈ ఎపిసోడ్ లో చివరకు చంద్రబాబు ను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం హైదరాబాద్ పంపారు. సోమవారం బాబు విశాఖ వస్తే ఎం జరుగుతుందో అని పార్టీ నాయకులు ఆందోళనలో ఉన్నారు.

విశాఖ దుర్ఘటన విషయంలో టీడీపీ ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతోందని భావిస్తున్న అధికారపక్షం టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు బాధిత గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతించలేదు. ప్రతిపక్ష నేత బాబు విషయంలో ఇదే వైఖరి అవలంభించే అవకాశం లేక పోలేదు. విశాఖ దుర్ఘటనపై బాబు రోజు జూమ్ యాప్ లో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఇది అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular