Family Politics: వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి కోరుకుంది ఆ ఫ్యామిలీ. అందుకు పార్టీ హై కమాండ్ అంగీకరించకపోవడంతో జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కేసుల రూపంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఫ్యామిలీ మొత్తం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడింది.. ఆ ఫ్యామిలీ మద్దతుతోనే పార్టీని ఏర్పాటు చేశారు. తొలి ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా సీట్లు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల, బాబాయ్ వివేకానంద రెడ్డి, సోదరులు అవినాష్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటే ఆ ఫ్యామిలీ మొత్తం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడింది. అయితే అదే సమయంలో టిడిపిలో చూస్తే మాత్రం చంద్రబాబుతో పాటు లోకేష్ కు సొంత కుటుంబం దన్ను అంతగా లేకపోయింది. కానీ ఇప్పుడు జగన్ కు ఫ్యామిలీ అండ తగ్గింది. చంద్రబాబుకు గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
* అప్పట్లో చంద్రబాబుకు వ్యతిరేకులు..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు విషయంలో కుటుంబ పరంగా ఒక భిన్న వాతావరణం ఉండేది. నందమూరి హరికృష్ణ అండగా నిలిచేవారు. కానీ అదే సమయంలో రెబల్గా కూడా వ్యవహరించేవారు. ఎప్పుడు ఎలా ఉండేవారో తెలియంది కాదు. మరోవైపు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు సైతం వ్యతిరేకంగా ఉండేవారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు. మరోవైపు సమీప బంధువు, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నియా శ్రీనివాసరావు సైతం చంద్రబాబుకు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. ఇలా సొంత కుటుంబ సభ్యులే చికాకుల మీద చికాకులు తెచ్చి పెట్టేవారు. మరోవైపు లోకేష్ ఆశించిన స్థాయిలో పట్టు పెంచుకోలేదు అప్పట్లో.
* జగన్ కు వ్యతిరేకం..
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరు మనసులో ఏముంటుందో కూడా చెప్పలేము. అప్పుడు జగన్ కు ఫ్యామిలీ అండగా నిలబడగా.. ఇప్పుడు అదే ఫ్యామిలీ వ్యతిరేకంగా మారిపోయింది. మొదట చెల్లెలు షర్మిల దూరమయ్యారు. ఆమెకు అండగా నిలిచేందుకు జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు తల్లి విజయమ్మ. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో కుటుంబం అంతా అడ్డగోలుగా చీలిపోయింది. మరో చెల్లెలు సునీత పూర్తిగా ప్రత్యర్థిగా మారిపోయారు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి వెంట కుటుంబంలో నిలిచేది అవినాష్ రెడ్డి, ఆయన ఫ్యామిలీ. మిగతా వారంతా దూరమైనట్టే. కేవలం దూరం మాత్రమే కాదు రాజకీయంగా విభేదించడం కూడా మొదలుపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో ప్రభావం కూడా చూపారు..
* పూర్తిగా అండగా..
అయితే ఇప్పుడు చంద్రబాబు విషయానికి వద్దాం. నందమూరి ఫ్యామిలీ పూర్తిగా ఆయనకు అండగా నిలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం మౌనం వహించక తప్పడం లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు సైతం రాజీ పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపితో తెలుగుదేశం పొత్తుకు పురందేశ్వరి ఒక కారణం. ప్రస్తుతం వారి కుమారుడు సైతం నారా లోకేష్ తో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు నారా రోహిత్ అంటే చంద్రబాబు తమ్ముడి కుమారుడు సైతం లోకేష్ తో కలిసి పని చేస్తున్నారు. ఇంకో వైపు లోకేష్ తోడల్లుడు, నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ సైతం పార్టీకి అండదండగా నిలుస్తూ వచ్చారు.. ఇలా చెప్పుకుంటే ఫ్యామిలీలు ఇప్పుడు అంతా ఒక్కటై చంద్రబాబుకు అండగా నిలబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబుకు ఇప్పుడు ఫ్యామిలీ బలం అదనం.