
తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యత కొత్త పీసీసీ పైనే ఉంది. కానీ.. ఆ పీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇటీవల దుబ్బాక బైపోల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ చీఫ్ ఉత్తమ్ రిజైన్ చేశారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ రేస్ నడుస్తోంది.
Also Read: మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకోబోతోందా..?
ముఖ్యంగా అధిష్టానం చూపు రేవంత్రెడ్డిపైనే ఉందన్నట్లు ప్రచారం నడుస్తోంది. రేవంత్కు పగ్గాలు ఇస్తేనే పార్టీ గాడిన పడుతుందని అధిష్టానం అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. దీంతో ఇప్పటికే గ్రూపుల కుమ్ములాటలతో మోకారిల్లుతున్న కాంగ్రెస్లో మరోసారి గ్రూపు రాజకీయాలు కనిపిస్తున్నాయి. పీసీసీ రేసులో ఉన్న రేవంత్రెడ్డిపై అన్నివైపులా నుంచి ఎటాక్ కొనసాగిస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కడం ఇష్టం లేని కొన్ని వర్గాలు.., అధికార పార్టీ.. కొన్ని మీడియా సంస్థలు.. పాత కేసులు.. వివాదాల్ని అదే పనిగా హైలెట్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రేవంత్పై ఎటాక్ మొదలైంది. సందర్భం లేకపోయినా మంత్రి పేర్ని నాని మంత్రి వర్గ సమావేశాల సారాంశాన్ని వివరించడానికి ఏర్పాటుచేసిన సమావేశంలో “పొట్టోడు.. హడావుడి చేస్తుంటాడు” అంటూ ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ పీసీసీ చీఫ్ అవ్వకుండా.. కాంగ్రెస్ హైకమాండ్పై అన్ని రకాల ఒత్తిళ్లు పెంచేలా కొంత మంది చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే తెలంగాణ రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని పేర్ని నాని రేవంత్ అంశాన్నిప్రస్తావించారని అంటున్నారు.
Also Read: లంబసింగికి పోయొద్దామా..
టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ నేతలు.. ఈ అంశంలో వారితో సమన్వయం చేసుకుంటున్నారని అంటున్నారు. పేర్ని నాని మాటలను.. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కొంత మంది వైరల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగానే తెలుస్తోంది. ఇప్పటికే సొంత పార్టీ నేతలే కాదు.. ఇతర పార్టీల నుంచి కూడా.. రేవంత్ కు పదవి ఇవ్వొద్దని కాంగ్రెస్ హైకమాండ్పై ఒత్తిడి పెంచుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయం తెలుసుకొని రేవంత్ రెడ్డి అభిమానుల పేరుతో కొంత మంది.. సోషల్ మీడియాలో పేర్ని నానిని బండ బూతులు తిడుతూ వీడియోలు అప్లోడ్ చేయడం ప్రారంభించారు. వీటిని రేవంత్ సోషల్ మీడియా టీం వైరల్ చేస్తోంది. ఇప్పటికే రేవంత్ టార్గెట్గా చాలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో ఏపీ నుంచి కూడా కొన్ని నడుస్తున్నాయన్న చర్చ ప్రారంభమైంది. మొత్తానికి రేవంత్కు బ్రేక్ వేసేందుకు ఏపీ నుంచి కూడా రాజకీయాలు మొదలయ్యాయనేది అర్థమవుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్