married life : దురదృష్టవశాస్తూ.. ఇటీవల వివాహేతర సంబంధాల గురించి ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఈ సంబంధాలు ఏర్పడడానికి కారణం ఏంటో తెలియదు గానీ.. భార్యభర్తల మధ్య సఖ్యత లేకపోవడమేనని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. అయితే ఈ విషయంపై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధాలు ఏర్పడడానికి భార్యభర్తల మధ్య ఉండే సమస్యలే అని అనడం సంచలనంగా మారింది. అయితే మానసిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. భార్యభర్తల మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది?
వివాహ బంధంలో మాటకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. భార్యభర్తలు రోజంతా కలిసి ఉన్నా మనసులో ఉన్న విషయాలను పంచుకోకపోతే ఇద్దరి మధ్య భావోద్వేగ దూరం పెరిగే అవకాశం ఉంటుంది. భార్యకు ఏం కావాలి? భర్త ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు? కుటుంబంలో ఏ అంశం గురించి ఆందోళన ఉంది? వంటి విషయాలను తెలుసుకోవడానికి పరస్పర సంభాషణ అవసరం. మాట్లాడుకోవడం ద్వారా చిన్న సమస్యలు పెద్దవిగా మారకముందే పరిష్కరించుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ.. మొబైల్ ఫోన్లోని సోషల్ మీడియా,ఇతర వీడియోల కారణంగా కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం తగ్గుతోంది. భోజనం చేసేటప్పుడు, పడుకునే ముందు కూడా ఫోన్లోనే ఉండటం వల్ల పక్కనే ఉన్న వ్యక్తితో మాట్లాడే అవకాశం తగ్గిపోతుంది. ఈ అలవాటు క్రమంగా భావోద్వేగ దూరానికి కారణమవుతుందని అని సూచిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య ప్రతి విషయంపైనా ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. భిన్నాభిప్రాయాలు సహజమే. అయితే ఒక సమస్య వచ్చినప్పుడు దానిపై ప్రశాంతంగా మాట్లాడకుండా మౌనం పాటించడం లేదా కోపంతో స్పందించడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఒక చిన్న అపార్థం పరిష్కారం కాకుండా అలాగే కొనసాగితే అది మరో విషయానికి, ఆ తర్వాత ఇంకో విషయానికి దారితీస్తుంది. చివరకు ఇద్దరి మధ్య నమ్మకం, ఆప్యాయత తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చు.
అయితే భార్యాభర్తల మధ్య సంభాషణ లేకపోవడంతోనే అక్రమ సంబంధాలు ఏర్పడటానికి కారణమని చెప్పడం సరైంది కాదు. వ్యక్తిగత నిర్ణయాలు, సంబంధాల్లో అసంతృప్తి, నమ్మకం లోపించడం, భావోద్వేగ సమస్యలు, పరిస్థితులు వంటి అనేక అంశాలు ఇందులో పాత్ర పోషించవచ్చు. అందువల్ల ఇలాంటి సమస్యలను ఏకైక కారణంతో ముడిపెట్టకుండా చూడాలి.