Badwel By Elections: తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కాకరేపాయి. ముఖ్యంగా తెలంగాణలోని హుజూరాబాద్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇక ఏపీలోని బద్వేలులో ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు తప్పుకోవడం చప్పగా మారింది. అధికార వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది.
Badvel
పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ముగిసింది. హుజూరాబాద్ లో 7 గంటల వరకు 86.4 పోలింగ్ శాతం నమోదైంది. ఈ పోలింగ్ లో చిన్నచిన్న ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. బద్వేలులో 5 గంటల వరకు పోలింగ్ శాతం 59.6శాతం నమోదైంది. ఈ నియోజకవర్గంలో 215292మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బరిలో అధికార వైసీపీ సహా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 221 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనపు బలగాలను మోహరించారు. 2019లో 77శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికలో గతంలో కంటే పదిశాతం వరకూ తగ్గిందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. వచ్చే నెల 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
పోలింగ్ సరళిని బట్టి ఇక్కడ 60శాతం వరకూ ఓట్లు అధికార వైసీపీకి పడ్డాయని తెలుస్తోంది. బీజేపీ గట్టిపోటీనిచ్చినా 35శాతంపైనే పడ్డాయని అంటున్నారు. టీడీపీ, జనసేన ఓటు బ్యాంకు బీజేపీకి పడలేదని తెలుస్తోంది. ఇక ప్రతిపక్షాలు వైదొలగడంతో ఓటర్లు కూడా ఓటు వేయడానికి ముందు రాలేదు. ఇదే బీజేపీ ఓటు బ్యాంక్ తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. బద్వేలులో వైసీపీ గెలుపు ఖాయం కాగా.. బీజేపీ ఎంత మేర పుంజుకుంటుంది? ఎన్ని ఓట్లు రాబడుతుందనేది వేచిచూడాలి.