విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ దుర్ఘటన విని తాను ధోగ్భ్రాంతికి గురైనట్లు పవన్ వెల్లడించారు. ఎల్జీ కంపెనీ నుండి విడుదలైన స్టైరీన్ విష వాయువు పీల్చడం వల్ల అనేకమంది అపస్మారక స్థితిలో ఎక్కడబడితే అక్కడ పడిపోవడం బాధకలిగించిందని పవన్ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విశాఖపట్నం జనసేన నాయకులతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పవన్, పలు కీలక సూచనలు చేశారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ధైర్యం చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంటపాలు, సమావేశ మందిరాల్లో భోజన వసతి కల్పించాలని, వైద్య సదుపాయాలకు సహాయపడాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు ప్రభావవంతంగా పని చేయకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని పవన్ అభిప్రాయపడ్డారు.
ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 11కి చేరినట్టు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో పలువురు కీలక అధికారులు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఎన్ ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘విశాఖలో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉంది. గ్యాస్ లీకేజీ నియంత్రించడంపై దృష్టిపెట్టాం. ఈ గ్యాస్ ప్రభావానికి గురైన 200 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో 25 నుంచి 30 మంది ప్రజల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, 80మందికి పైగా వెంటిలేటర్లపైనే ఉన్నారు. 500 మందికి పైగా ప్రజల్ని ఖాళీ చేయించాం’’ అని వివరించారు.