India Israel Relations: భారత్ – ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు దశాబ్దాల నాటివి. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన దేశం. అమెరికాతో సన్నిహితంగా ఉండే దేశం ఇజ్రాయెల్. ఇది భారత్కు కూడా కలిసి వస్తుంది. ఇక ఇజ్రాయెల్–భారత మధ్య రక్షణ ఒప్పందం కూడా ఉంది. ఆయుధాలు సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో ఇటీవలే మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లొచ్చారు. తాజాగా ఆగస్టు 6న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇండియా–ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, పశ్చిమాసియా తాజా పరిణామాలపై చర్చ జరిగింది. ఈ కాల్ మోదీ నుంచి కాదు, నెతన్యాహూ వైపు నుంచే వచ్చిందని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.
అనూహ్య స్నేహం.. అనుకోని భయం
ఒక వ్యక్తి దూరం నుంచి ఎదురుగా వస్తుంటే, చూసి పక్క సందులోకి తప్పుకోవాలని అనుకుంటాం. కానీ అతను చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చేస్తే, ఆ రోజు బ్యాడ్ డే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంబంధం ఒకరికి లాభాలు, మరొకరికి నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నెతన్యాహూ పాత్ర అలాంటి అనుభవాన్ని గుర్తుకు తెస్తోంది. సన్నిహితత్వం కొన్ని సంక్లిష్టతలు సృష్టిస్తోంది.
మోదీ పర్యటన ఇరాన్పై ప్రభావం..
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించింది. ఆ ముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. నెతన్యాహూ ప్రోటోకాల్ను దాటి విమానాశ్రయానికి వచ్చి ఆహ్వానించి, కౌగిలించుకున్నారు. ఈ అత్యధిక ఆతిథ్యం ఇరాన్లో అసంతృప్తిని పెంచింది. భారత్ తమ వైపు లేదనే భావన ఏర్పడేలా చేసింది. ఇరాన్ కూడా భారత్కు ముఖ్యమైన భాగస్వామి. చమురు తక్కువ ధరకు, రూపాయల్లో చెల్లించే వీలు ఉండేది. ఆ డబ్బుతో ఇరాన్ భారత్లోనే వస్తువులు కొనేది. గతంలో భారత్ రోజువారీ చమురు అవసరాల్లో 10 శాతం వరకు ఇరాన్ నుంచి తీసుకునేది. ఇప్పుడు అమెరికా వైపు మళ్లడంతో ఆ కొనుగోళ్లు దాదాపు ఆగిపోయాయి. సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. ఇలాంటి సమయంలో నెతన్యాహూ చూపిన అత్యధిక సన్నిహితత్వం ఇరాన్లో మరిన్ని ప్రశ్నలు లేవనెత్తింది.
అమెరికా వైఖరి..
యుద్ధం మొదలైన తర్వాత భారత్ ఇరాన్కు సన్నిహితంగా ఉండలేకపోతోంది. అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత సంతాపం తెలపడంలో కూడా జాగ్రత్త తీసుకుంది. అమెరికాతో ఉన్న సంబంధాలు దీనికి కారణం. అయితే అమెరికా వైపు నుంచి పూర్తి సానుకూలత కనిపించడం లేదు. ట్రంప్ భారత్ను విమర్శించారు, టారిఫ్లు విధించారు, వీసా నిబంధనలు కఠినం చేశారు. పాకిస్తాన్తో కూడా వ్యాపార సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
సమతుల్య దౌత్యం అవసరం
ఇజ్రాయెల్ మిత్రదేశమే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వైపుకే మొగ్గు చూపినట్లు అనిపించకుండా చూసుకోవాలి. ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితో సమాన దౌత్య సంబంధాలు కాపాడుకోవాలి. లేకపోతే అంతర్జాతీయ వాణిజ్యంలో నష్టాలు రావచ్చు. భారత్ అగ్రరాజ్యంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంటే, అన్ని దేశాలతో సఖ్యంగా నడవాల్సి ఉంటుంది.
మోదీ ప్రధాని అయ్యాక చాలా దేశాల్లో పర్యటించారు. అనేక దేశాలతో సంబంధాలు పునరుద్ధరించారు. ఇప్పటికే ఉన్న సంబంధాలు మెరుగుపర్చారు. కానీ నెతన్యాహూతో జరుగుతున్న మాటలు, చర్చలు ప్రస్తుత భూరాజకీయ పరిస్థితుల్లో భారత్కు అదనపు ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. సమతుల్య విధానమే సురక్షితమైన మార్గం.