Pawan Kalyan Varahi Yatra
Pawan Kalyan Varahi Yatra: పవన్ విశాఖలో సౌండ్ చేస్తున్నారు. వైసిపి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ నేరుగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ను తాను ఏకవచనంతో సంబోధిస్తానని చెప్పి మరి.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విశాఖలో వారాహి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు పవన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. జగన్ పై ఆ స్థాయిలో కసి ఉందా అన్నట్టు ధ్వజమెత్తారు.
జగన్ నాయకుడు కాదని పవన్ అభివర్ణించారు. ఆయన ఒక వ్యాపారి అని,కమిషన్ ఏజెంట్ అని, ఒక్క మద్యం వ్యాపారం ద్వారానే 30 వేల కోట్ల రూపాయల సంపాదించాడని, ఇప్పుడు అదే డబ్బును పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడని బలమైన ఆరోపణలు చేశారు. అయితే గత రెండు యాత్రలకు భిన్నంగా పవన్ మాట్లాడుతున్నారు. కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. తొలి రెండు విడత యాత్రలో వైసీపీ మంత్రులు, కీలక నేతలపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ పైనే గురిపెట్టారు. ఈ ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.
వైసీపీ సర్కార్ పాలన రాజధానిగా విశాఖను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పవన్ విశాఖలో వైసీపీ సర్కార్ జరుపుతున్న దురాగతాలను, నాయకుల వైఫల్యాలను పవన్ ఎండగట్టారు.’ విశాఖలో భూములను కబ్జా చేశారు. ప్రభుత్వ సంస్థల భూములను తనఖా పెట్టారు. వేల సంవత్సరాల నాటి ఎర్రమట్టి దిబ్బలను నాశనం చేస్తున్నారు. రుషికొండను బోడి గుండు చేశారు’.. అంటూ పవన్ చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. విశాఖ తనకు అనేకం ఇచ్చిందని.. ఇక్కడే తాను చాలా నేర్చుకున్నాను అని పవన్ గుర్తు చేసుకున్నారు.
జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న తీరును పవన్ ఎండగట్టారు.ప్రజల్లో చైతన్యం తీసుకునే ప్రయత్నం చేశారు. జగన్ పై 36 క్రిమినల్ కేసులు ఉన్నాయని.. అలాంటి వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఈ నాలుగేళ్లలో చూపించాడని.. 2024 ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే పవన్ విశ్వరూపం చూపిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం నింపుతూనే… జగన్ను మరోసారి ఎన్నుకుంటే జరగబోయే పరిణామాలను వివరిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే హెచ్చరికలే జారీ చేస్తున్నారు. అయితే ఇది ప్రజల్లోకి బలంగా వెళుతూ ఉండటంతో అధికార వైసీపీలో వణుకు ప్రారంభమైంది. అయితే పవన్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడంలో వైసీపీ నేతలు వైఫల్యం చెందుతున్నారు.