Janasena: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టింది. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందుకే పట్టణాలతో పాటు నగరాల్లో తనదైన మార్కు చూపాలని చూస్తోంది జనసేన. ఇప్పటికే ఆ పార్టీ గోదావరి జిల్లాల్లో బలంగా ఉంది. ఆ తరువాత అంతటి బలం ఉత్తరాంధ్రలోనే కనిపిస్తోంది. అందుకే ఈసారి ఉత్తరాంధ్రలో కీలకమైన మున్సిపాలిటీలతో పాటు నగరాలపై కన్నేసింది. మూడు కార్పొరేషన్లకు గాను ఒకచోట తమ పార్టీ అభ్యర్థి మేయర్ గా ఎంపికయ్యలా పావులు కదుపుతోంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా విజయనగరం మేయర్ పీఠంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో మూడు కార్పొరేషన్లకు గాను ఆ ఒక్క సీటు తమకు విడిచి పెట్టాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
* మొన్నటి ఎన్నికల్లో ఆరు చోట్ల..
మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఆరు చోట్ల గెలిచింది జనసేన. 34 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో.. పొత్తులో భాగంగా ఆరు చోట్ల పోటీ చేసి.. అన్నిచోట్ల గెలిచింది జనసేన. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు చోట్ల.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒకచోట.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గంలో జనసేన గెలిచింది. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం రెట్టింపు సీట్లను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అంటే మరో ఆరు నియోజకవర్గాలను అదనంగా తీసుకోవాలని భావిస్తోంది. అయితే వాటితో పాటు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది జనసేన. గ్రేటర్ విశాఖను వదులుకునేందుకు తెలుగుదేశం ఇష్టపడదు. శ్రీకాకుళం కార్పొరేషన్ కోర్టు చిక్కుల్లో ఉంది. అందుకే విజయనగరం తీసుకోవాలని చూస్తోంది జనసేన.
* పట్టు పెంచుకోవాలన్న ఆలోచన..
కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే విజయనగరంలో క్రమేపి పట్టు సాధించాలన్నది జనసేన ఆలోచన. మొన్నటి ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థి గెలిచారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో విజయనగరం జిల్లా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాంధ్రలో విశాఖ తర్వాత విజయనగరందే స్థానం. అటువంటి చోట ప్రాతినిధ్యం పెంచుకోవాలని చూస్తోంది జనసేన. మేయర్ తో పాటు మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను జనసేన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ మేరకు టిడిపి నాయకత్వానికి కూడా ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే 2021లో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. అంతకుముందు వరకు మున్సిపాలిటీగా ఉండేది.. తొలిసారిగా అక్కడ వైసీపీ జెండా ఎగిరింది. ఈసారి మాత్రం జనసేన జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ ఉవ్విల్లూరుతోంది. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.