Pakistan Army : పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం కన్నా సైన్యం బలమైనది. పాలకులు ఎవరైనా సైన్యం చెప్పు చేతల్లో ఉండాల్సిందే. సైన్యం దేశ రక్షణకు బాధ్యత వహిస్తుందని చెప్పుకున్నా, సొంత ప్రజలు, రాజకీయ నాయకుల నుంచే తీవ్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటీవల పెషావర్లో జరిగిన కార్యక్రమంలో జమాత్ ఉలేమా-ఇ-ఇస్లామ్(ఎఫ్) అధ్యక్షుడు మౌలానా ఫజలుర్ రెహమాన్ ప్రస్తుత సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ను లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత చరిత్రను గుర్తుచేస్తూ సైన్యం ప్రగల్భాలు, ప్రజల కష్టాల మధ్య ఉన్న అంతరాన్ని ఎత్తి చూపారు.
చరిత్రను గుర్తు చేస్తూ..
మౌలానా ఫజలుర్ రెహమాన్ మాట్లాడుతూ.. నిరంతర అణచివేత, రక్తపాతం కొత్త భౌగోళిక సరిహద్దుల మార్పులకు దారి తీయవచ్చని హెచ్చరించారు. దేశ ప్రజలు కష్టాలు పడుతుండగా సైన్యం ఆర్భాటపు ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొన్నారు. 1971లో అప్పటి సైన్యాధ్యక్షుడు యాహ్యా ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన సైనికులను ఉద్దేశించి పర్వతాల్లో, ఎడారుల్లో, వీధుల్లో ఎక్కడైనా శత్రువులకు వ్యతిరేకంగా పోరాడతాం అని పెద్దపెద్ద మాటలు చెప్పినట్లు గుర్తు చేశారు. అయినా ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఓడిపోయిందని, ప్రగల్భాలు నిజం కాలేదని స్పష్టం చేశారు.
1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం
1971లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం కేవలం 13 రోజుల్లో ముగిసింది. ఆ సమయంలో సుమారు 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. దీని ఫలితంగా డిసెంబర్ 16న భారత్కు అపూర్వ విజయం దక్కడమే కాకుండా, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఈ చారిత్రక సంఘటనను ప్రస్తావిస్తూ, ఇప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పు లేదని మౌలానా అభిప్రాయపడ్డారు. ప్రజలు బాధపడుతుంటే సైన్యం ఆనందపడటం సముచితం కాదని హితవు పలికారు.
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, అంతర్గత అణచివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విమర్శలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సైన్యం దేశ రక్షణ పేరుతో బలమైన ప్రకటనలు చేస్తున్నా, గత అనుభవాలు చూపించేది వేరు. ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నప్పుడు సైన్యం ఆధిక్యత, ప్రగల్భాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. మౌలానా ఫజలుర్ రెహమాన్ వంటి నేతలు సొంత సైన్యాన్ని విమర్శించడం, అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని సూచిస్తోంది. ఇవి పాకిస్తాన్ సైన్యం, రాజకీయ నాయకత్వం మధ్య ఉన్న సంబంధాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.