Mangal Gauri Vratham : తెలుగు నెలల్లో అత్యంత పవిత్ర మాసంగా శ్రావణం గురించి చెప్పుకుంటారు. ఈ నెలలో పూజలు, వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అయితే మంగళ గౌరీ వ్రతంలో దానధర్మాలు అత్యంత ముఖ్యమని కొందరు పండితులు చెబుతున్నారు. అసలు ఈ వ్రతంలో దానధర్మాలు ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన ఏంటి?
దానం.. అనగానే ఉన్నవారు లేనివారికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం ఇవ్వడం అని అంటూ ఉంటారు. కానీ దానం అనగానే ఒకరికొకరు కలిసిమెలిసి ఉండి వారి అవసరాలను తీర్చుకోవడం. ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకొని వారిని తమతో పాటు తీసుకెళ్లడం. మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, వస్త్రాలు, తాంబూలం వంటివి ఇతర మహిళలకు లేదా అవసరమైన వారికి ఇవ్వడం ఆచారంగా వస్తుంది. ఇలాంటి మంగళకరమైన వస్తువులను పంచుకోవడం ద్వారా సౌభాగ్యం, ఆనందం కలుగుతుందని పెద్దల ద్వారా తెలుస్తోంది. ఈ వస్తువులు ఇచ్చి మీ ఇంట్లో శుభం కలగాలి అని దీవిస్తే వారిని ఆశీర్వదించినట్లు అవుతుందని చెబుతారు.
మంగళ గౌరీ వ్రతం కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాకుండా కుటుంబం శ్రేయస్సు ఉండాలని.. మహిళల మధ్య పరస్పర గౌరవం పెంపొందించాలని తెలుపుతుంది. ఈ వ్రతం సందర్భంగా ముత్తైదువులు అంతా కలిసి ఒక్క చోటా చేరుతారు. ఇలా అందరూ ఒకరికొకరు సంతోషంగా ఉండడం వల్ల అక్కడి వాతావరణం స్వచ్ఛంగా మారుతుంది. అలాగే మహిళలు అంతా కలిసి మంగళ గౌరీని పూజించడం వల్ల ఎంతో సంతోషిస్తుందని.. వారి ఇళ్లల్లో సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని చెబుతారు.
అలాగే ఈ వ్రతం చేసిన తర్వాత మానసికంగా ఎంతో ప్రశాంతతను కలిగి ఉంటారు. కుటుంబంలో శాంతి కలగాలని చేసే ఈ వ్రతంతో తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఈ వ్రతం కేవలం సంపద, సౌభాగ్యం కోసమే కాకుండా సమాజంలో మహిళల మధ్య ఐకమత్యాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు.