Kodali Nani: వైసిపి ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభిమానులకు షాక్ కు గురి చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం.2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని తేల్చి చెప్పారు.గత నాలుగు ఎన్నికల్లో వరుసగా కొడాలి నాని గుడివాడ నియోజక వర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు.గుడివాడను తన అడ్డగా నిరూపించుకున్నారు.అయితే ఈసారి అంత ఈజీగా గెలిచే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ముందు ఈ తరహా ప్రకటన చేయడం ప్రజల్లో సెంటిమెంట్ కోసమేనని టాక్ నడుస్తోంది.
2004లో మొదటిసారి కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.నందమూరి హరికృష్ణ సిఫారసులతో అప్పట్లో టిక్కెట్ దక్కించుకున్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి మేరకు మరోసారి చంద్రబాబు టిక్కెట్ కేటాయించారు. అయితే టిడిపి నాయకత్వాన్ని విభేదించి వైసిపిలో చేరారు. 2014,2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానిని జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి నుంచి తొలగించారు. అయినా సరే జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికలే తనకు చివరివని ప్రకటించి నాని సంచలనానికి తెర తీశారు.
గుడివాడలో ఎలాగైనా పట్టు బిగించాలని టిడిపి భావిస్తోంది. బలమైన నేతగా ఉన్న ఎన్నారై వెనిగండ్ల రామును బరిలో దించింది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. మరోవైపు కాపులు సైతం గణనీయంగా ఉన్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం కొడాలి నాని పై ఆగ్రహంగా ఉంది. జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు, లోకేష్ లపై నాని విరుచుకుపడుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈసారి నానికి వ్యతిరేకంగా మారుతున్నారు. అయితే తనకున్న మాస్ ఫాలోయింగ్ తో ఎన్నికల్లో అధిగమించగలనని నాని ధీమాతో ఉన్నారు.అయితే ఇంతవరకు వైసీపీ హై కమాండ్ టిక్కెట్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు.అందుకే నాని ఈ తరహా ప్రకటన చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
2024 ఎన్నికల్లో కొడాలి నాని కి గుడివాడ నుంచి గట్టి పోటీనే ఉంది.అసలు ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తారో లేదో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇటీవల సడన్ గా మండల హనుమంతరావు పేరు వినిపించింది. అభివృద్ధి లేకపోవడంతో కొడాలి నాని పై గుడివాడలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అందుకే ఈసారి ఆయన మార్చే ఉద్దేశం వైసీపీ హై కమాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిశగా సంకేతాలు రావడంతో కొడాలి నాని వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని పెద్దగా అభివృద్ధి చేయలేదని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈసారి కొత్త అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ సైతం కొత్త ఆలోచన చేస్తోంది. కొడాలి నానిని సైడ్ చేసే పనిలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే నాని సింపతి కోసం చేశారో.. వైసిపి హై కమాండ్ కు దారికి తెచ్చుకోవాలని భావించారో తెలియాల్సి ఉంది.