Shravana Masam: శ్రావణ మాసం వచ్చిందంటే చాలామంది భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, వ్రతాలు పాటిస్తారు. ముఖ్యంగా సోమ, శని, శుక్రవారాల్లో రోజంతా ఉపవాసం ఉండేవారు చాలామంది ఉన్నారు. అయితే ఉపవాసం అంటే పూర్తిగా ఆహారం, నీటిని వదిలేయడం మాత్రమే కాదు. శరీరానికి అవసరమైన ద్రవాలు, పోషకాలు అందేలా ఆహారాన్ని ఎంచుకోవడం. అయితే ఈ సమయంలో కొన్ని ఆహార పదార్థాలతో కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పోషక విలువలు ఎక్కువ ఉండి.. ఎలాంటి అనారోగ్యం కాకుండా ఉండే వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల నీరసం రాకుండా సాధారణంగా ఉండగలుగుతారు. మరి అలాంటి ఫుడ్స్ ఏవో చూద్దాం..
అరటిపండు:
ఉపవాస సమయంలో తీసుకోగల సులభమైన ఆహారాల్లో అరటిపండు ఒకటి. ఇందులో సహజంగా కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఆకలి, నీరసం అనిపించినప్పుడు ఒక అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. అయితే మధుమేహం ఉన్నవారు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన వారు తమ వైద్యుడు లేదా డైటీషియన్ సూచనలకు అనుగుణంగా పండ్ల పరిమాణాన్ని నిర్ణయించుకోవడం మంచిది.
కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా..
ఉపవాస సమయంలో నీరు తగ్గిపోవడం వల్ల అలసట, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే కొబ్బరి నీళ్లు మంచి ఎంపికగా ఉంటాయి. ఇవి కూడా మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
సగ్గుబియ్యం:
శ్రావణ ఉపవాసాల్లో సగ్గుబియ్యం విస్తృతంగా ఉపయోగిస్తారు. సగ్గుబియ్యం ఖిచ్డీ వంటి వంటకాలు శరీరానికి కార్బోహైడ్రేట్లను అందిస్తాయి. అయితే ఎక్కువ నూనెతో తయారు చేసిన సగ్గుబియ్యం వడలు, ఇతర డీప్ఫ్రైడ్ పదార్థాలను తరచుగా తినడం మంచిది కాదు. ఉపవాస ఆహారాల్లో ఉడికించడం, ఆవిరితో వండడం, తక్కువ నూనెతో తయారు చేయడం వంటి పద్ధతులు మెరుగైన ఎంపికలుగా సూచించబడుతున్నాయి.
ఉడికించిన చిలగడదుంప..
చిలగడదుంప ఉపవాస సమయంలో కడుపు నిండుగా ఉంచే మరో ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్లు, కొంత ఫైబర్ ఉండటంతో ఎక్కువసేపు ఆకలి రాకుండా సహాయపడుతుంది. చిలగడదుంపను ఉడికించి లేదా ఆవిరితో వండుకుని తీసుకోవడం మంచిది. అయితే కేవలం చిలగడదుంప వంటి ఆహారాలను మాత్రమే ఎక్కువగా తినకుండా ఇతర పీచు, ప్రోటీన్ వనరులతో కలిపి తీసుకోవడం మంచిది.
బాదం, ఖర్జూరాలు..
బాదం వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ తదితర పోషకాలు ఉంటాయి. ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఉండటంతో తక్కువ పరిమాణంలో తీసుకుంటే శక్తిని అందించవచ్చు. అయితే ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ను ఎక్కువగా తినకుండా పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది.
ఆపిల్, దానిమ్మ వంటి పండ్లు..
ఉపవాస సమయంలో ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు అందుతాయి. వీలైనంత వరకు పండ్లను జ్యూస్గా కాకుండా నేరుగా తినడం మంచిదని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
తగినంత నీరు:
శరీరంలో నీరు తగ్గడం వల్ల కొన్నిసార్లు అలసటగా అనిపించవచ్చు. అందుకే రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. నీటితో పాటు కొబ్బరి నీళ్లు, నిమ్మ నీరు వంటి పానీయాలను కూడా తీసుకోవచ్చు. అయితే ఎక్కువ చక్కెర కలిపిన పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.