CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని ఆరు నెలలు కూడా లేదు. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ఇక అధికార బీఆర్ఎస్ కాస్త ఆలస్యంగా ఎన్నికల శంఖారావం మోగించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్లీనరీని ఎన్నికల సన్నద్ధత సభగా మార్చారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఈ మీటింగ్ కేసీఆర్ చేసిన కామెంట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ‘పనితీరు సరిగా లేని వారి తోకలు కట్ చేస్తా.. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల చిట్టా నా చేతిలో ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోండి’ అని ఆయన ఇచ్చిన వార్నింగులు టెన్షన్ పెడుతున్నాయి. సమావేశం పూర్తయిన మరుక్షణం నుంచే ఎమ్మెల్యేల మధ్య ఇదే అంశంపై చర్చ మొదలైంది. సీఎం ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు? ఆయన లిస్టులో ఎవరె వరున్నారు? ఈసారి టికెట్లు కట్ అయ్యేదెవరికి?ఏ జిల్లాలో ఎంత మంది ఉన్నారు? అందులో మంత్రులు కూడా ఉన్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
సిట్టింగ్లకే హామీ అటకెక్కినట్టే..
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తే గెలిచే శక్తి ఎంత మందికి ఉందోనని తెలు సుకునేందుకు సీఎం కేసీఆర్ సర్వేలను ప్రమాణికంగా తీసుకుంటున్నారు. అందుకోసం ఆయన పలు రకాల సంస్థలతో సర్వేలు చేయిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే ఏయే దందాలు చేస్తున్నారు? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? వివిధ పనుల కోసం వచ్చే ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ? సంక్షేమ పథకాల మంజూరు కోసం వచ్చే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారా? అనే కోణంలో నివేదికలు తెప్పించుకుంటున్నారు. కేసీఆర్ ఇప్పటికే తెప్పించుకున్న రిపోర్టులో 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని సీఎం మీటింగ్లో స్పష్టం చేసినట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు.
రిపోర్టు కోసం ఆరా..
పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆ లిస్టులో తాము ఉన్నామా? లేమా? అనే టెన్షన్ చాలామందిని పట్టుకుంది. ప్రగతిభవ¯Œ కు సన్నిహితంగా ఉండే వర్గాల ద్వారా ఆ జాబితాలో తాము ఉన్నామా.. లేదా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. తమపై నెగెటివ్ రిపోర్టు ఉంటే మార్చుకుంటామని వేడుకుంటున్నారు. అలా వేడుకునే వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం.
మాట మార్చిన కేసీఆర్
సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇస్తామని గత అక్టోబర్ 5న టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీ మాచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తతస్థాయి సమావేశంలో స్పష్టంగా చెప్పారు కేసీఆర్. దీంతో ఎమ్మెల్యేలందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఆరు నెలలు కూడా గడవకుండానే కేసీఆర్ మాట మార్చారు. తాజాగ ప్లీనరీలో పనితీరే టికెట్కు ప్రామాణికం అని ప్రకటించారు. ఎవరికి టికెట్ ఇవ్వాలనేది తనకు తెలుసని పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొనగా ఆశావహుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
ఎర్రబెల్లి సర్వేతో కేసీఆర్ ఏకీభవించారా?
గతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా తాను సొంతంగా సర్వే చేయించానని ప్రకటించారు. ఇందులో 40 మంది ఎమ్మెల పనితీరు బాగా లేదని పేర్కొన్నారు. వీరిని మారిస్తే బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని చెప్పారు. దీనిపై అప్పట్లో దుమారం రేగింది. దీంతో వెంటనే ఎర్రబెల్లి మాట మార్చారు. 40 మంది పనితీరు మెరుగుపర్చుకోవాలని చెప్పానని అన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ సర్వే, ఎర్రబెల్లి సర్వే దాదాపు ఒకే విధంగా ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఆ 30 నుంచి 40 మందిని మారుస్తారని తెలుస్తోంది.