Telangana BJP: తెలంగాణలో 2028 ఎన్నికల్లో అధికారం సాధించాలనే స్పష్టమైన లక్ష్యంతో బీజేపీ అధిష్టానం కీలక వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ బలోపేతం, సంస్థాగత పునర్నిర్మాణం, నాయకత్వ సర్దుబాట్లు ఇవన్నీ ఒకే దిశలో కదులుతున్నాయి. ఈ ప్రక్రియలో పది మందితో కమిటీ ఏర్పాటు, జాతీయ కార్యవర్గం నుంచి కొందరు నాయకులను తప్పించడం, నవంబర్ నుంచి పూర్తి ఫోకస్ వంటివి ముఖ్యమైన అంశాలుగా కొత్త వ్యూహంలో భాగంగా ఉన్నాయి.
సంస్థాగత బలోపేతానికి 10 మెన్ కమిటీ..
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి పది మందితో కమిటీని ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నుంచి నాయకత్వ వరకు ఉన్న లోపాలను గుర్తించి, నిర్దిష్ట చర్యలు చేపట్టే దిశగా ఈ కమిటీ పని చేస్తుంది. తెలంగాణలో బీజేపీ ఇంకా స్థిరమైన సామాజిక, ప్రాంతీయ బలాన్ని సాధించలేదన్న భావనతోనే ఈ కమిటీ పనిచేస్తుంది.
జాతీయ కార్యవర్గం నుంచి మినహాయింపు..
బండి సంజయ్, కె. లక్ష్మణ్, డీకే అరుణలను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించడం కేవలం పరిపాలనా మార్పు కాదు. పార్టీ వర్గాల ప్రకారం ఇది తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించే వ్యూహంలో భాగం. జాతీయ స్థాయి బాధ్యతల నుంచి విముక్తి చేయడం ద్వారా వారిని రాష్ట్ర స్థాయి పనులపై పూర్తి శ్రద్ధ పెట్టే అవకాశం కల్పించింది. ఇది అంతర్గత సమతుల్యతను కాపాడుతూ, రాష్ట్ర కార్యాచరణను వేగవంతం చేసే ప్రయత్నంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
నవంబర్ నుంచి పూర్తి ఫోకస్..
నవంబర్ నుంచి తెలంగాణపై బీజేపీ పూర్తి దృష్టి పెట్టనుంది. ఈ సమయంలో రాష్ట్ర కమిటీలో బండి సంజయ్, ఈటల రాజేందర్లకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఇది అనుభవజ్ఞులైన నాయకులను ముందుకు తీసుకువచ్చి, సంస్థాగతంగా, రాజకీయంగా బలమైన బృందాన్ని తయారు చేస్తుంది. 2023 ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, మరింత సమన్వయంతో కార్యాచరణ సాగించాలన్న ప్రణాళికతో ముందుకెళ్తోంది.
త్రిముకపూర్లో ముందు నిలిచేలా..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర, బీజేపీ మూడో స్థానంలో ఉంది.
2028 ఎన్నికల నాటికి త్రిముఖ పౌరులు బిజెపిని ముందు నిలిపేలా అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కలుగుతుంది. బీజేపీకి ఇంకా విస్తృత సామాజిక బేస్, స్థిరమైన నాయకత్వం, స్థానిక సమస్యలపై స్పష్టమైన ప్రత్యామ్నాయం అవసరం. 10 మెన్ కమిటీ, నాయకత్వ సర్దుబాట్లు, నవంబర్ నుంచి పూర్తి ఫోకస్.. ఇవన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా కనిపిస్తున్నాయి. 2028 లక్ష్యం చాలా దూరంగా ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే సంస్థాగత పునాదులు వేయాలనేది అధిష్టానం ఆలోచన.
బీజేపీ తెలంగాణలో కేవలం ప్రతిపక్ష పాత్రకే పరిమితం కాకుండా, అధికార పార్టీగా మార్చాలని స్పష్టమైన లక్ష్యంతో అధినాయకత్వం చర్యలు చేపట్టింది. ఎందుకు అవసరమైన వ్యూహాలతో ముందుకు కదులుతోంది. ఈ వ్యూహాలు ఎంతవరకు విజయవంతమవుతాయో రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుంది.