Konda Susmitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. పరకాల ప్రాంతంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని.. కచ్చితంగా ఆయన మళ్ళీ గెలుస్తారని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు కొండా సురేఖ దూరంగా ఉన్నారు. మరో కీలక నాయకుడు “ఇనుగాల” కూడా దూరంగానే ఉన్నారు. రేవూరి ప్రకాశ్ రెడ్డి సుదీర్ఘకాలం టిడిపిలో ఉన్నారు. ప్రకాష్ రెడ్డికి.. రేవంత్ రెడ్డికి దగ్గరి సంబంధం ఉంది. రేవూరి ప్రకాష్ రెడ్డి టిడిపి నుంచి బిజెపిలో చేరారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరారో.. అప్పుడే ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. తన సమీప ప్రత్యర్థి చల్ల ధర్మారెడ్డి మీద విజయం సాధించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ కు పరకాల నియోజవర్గంతో దగ్గర సంబంధం ఉంది. ఆయన భర్త కొండా మురళీధర్ రావుకు పరకాల నియోజకవర్గంలో అభినాభావ సంబంధం ఉంది. కొండ మురళి బంధువులు కూడా పరకాల నియోజకవర్గం లో ఉన్నారు. ఎప్పటికైనా సరే తన కూతుర్ని పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించాలని మురళి భావిస్తున్నారు. ఇటీవల తన కూతురు రాజకీయ ప్రవేశంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తన కూతురు పోటీ చేస్తుందని మురళి క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల రేవంత్ రెడ్డి పరకాల సభలో రేపూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడంతో కొండ వర్గం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో సుస్మిత తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక స్టోరీ పోస్ట్ చేశారు. అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే అంటూ ఆమె చేసిన స్టోరీ వివాదాస్పదంగా మారింది. ఈ స్టోరీ ద్వారా ముఖ్యమంత్రి కి సుస్మిత షాకిచ్చారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే సుస్మిత కావాలని పోస్ట్ చేశారా.. లేదా యాదృచ్ఛికంగా జరిగిందా అనేది తేలాల్సి ఉంది.సుస్మిత స్టోరీ ద్వాారా సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది.