Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 32 నెలలు దాటింది. రేవంత్రెడ్డి నేతృత్వంలోణి ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నిక హామీలు అమలు చేయలేదని విపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. రైతు బందు ఎగ్గొట్టారని, రైతుబీమా ప్రీమియం చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఇక గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వాడే వారికి ఉచితంగా కరెంటు సరఫరా చేస్తోంది రేవంత్ సర్కార్. అయితే గృహజోతి పథకం కారణంగా రాష్ట్రంలో మైనారిటీలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని సీఎం స్వయంగా ప్రకటించారు.
సమ్మిట్లో సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల మైనారిటీల ఎక్సలెన్స్ సమ్మిట్లో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీనివల్ల హైదరాబాద్ పాతబస్తీలోని ముస్లింలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని స్వయంగా ప్రకటించారు. అదే సందర్భంలో పాతబస్తీలో మైనారిటీలు విద్యుత్ దొంగతనం చేస్తారని, బిల్లులు కట్టరని అసెంబ్లీలోనూ ఫిర్యాదులు వస్తుంటాయి అని ప్రస్తావించి, అయినా ఆ పథకం వారికే ఎక్కువ ఉపయోగపడుతోందని గర్వంగా చెప్పారు.
విద్యుత్ చౌర్యం ఆరోపణలు..
గృహ జ్యోతి పథకం వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు, తక్కువ ఆదాయ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ఇది మత ఆధారితం కాదు. అయితే సీఎం తన మాటల్లోనే పాతబస్తీలోని చార్మినార్, బేగంబజార్, ఆస్మాన్ఘాడ్ వంటి ప్రాంతాల్లో 55 నుంచి 60 శాతం ముస్లింలు ఉంటారని, గతంలో బిల్లులు చెల్లించకపోవడం, విద్యుత్ దొంగతనం ఆరోపణలు ఉన్నాయని అంగీకరించారు. ఇప్పుడు అదే ప్రాంతం లబ్ధిదారుల్లో అగ్రస్థానంలో ఉందని చెప్పడం, విమర్శకులకు ఎగవేతదారులకు రివార్డ్ అనే అర్థం వచ్చేలా చేసింది.
అన్నీ ఎగ్గొట్టడమే..
గతంలోనూ పాతబస్తీలో విద్యుత్ నష్టాలు, బిల్లు వసూళ్లు తక్కువగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు, చర్చలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని సబ్సిడీ రూపంలో భరిస్తోంది. ఫలితంగా నిజాయితీగా బిల్లులు కట్టేవారు, పన్నులు చెల్లించేవారు పరోక్షంగా భారం మోస్తున్నారనే వాదన బలపడుతోంది.
పన్ను చెల్లింపుదారులపై ప్రభావం..
ఉచిత విద్యుత్ ఖర్చు ప్రభుత్వం డిస్కమ్లకు చెల్లిస్తోంది. ఆ డబ్బు ప్రజా ధనం నుంచే వస్తుంది. బిల్లులు కట్టేవారు, పన్నులు చెల్లించేవారు ఇప్పటికీ తమ భాగం చెల్లిస్తూనే ఉన్నారు. అదనపు సబ్సిడీ భారం వారిపైనే పడుతుంది. పాతబస్తీలో గతంలో బిల్లు చెల్లించని వారికి ఇప్పుడు చట్టపరంగా జీరో బిల్ వస్తోంది. ఇది నియమాలు పాటించని వారికి ప్రోత్సాహం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓటు బ్యాంక్ రాజకీయాలు..
సీఎం హిందువులు, ముస్లింలు నా రెండు కళ్లు అని చెప్పారు. అయితే ఒక నిర్దిష్ట ప్రాంతం, నిర్దిష్ట మత వర్గం గురించి మాత్రమే ఇలా ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పథకం సార్వత్రికమైనప్పటికీ ముస్లింలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నట్లు అంగీకరించక తప్పలేదు. నిజానికి పథకం అందరికీ ఉంది, కానీ సీఎం మాటల్లోనే మైనారిటీలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారని చెప్పడం గమనార్హం.
పాతబస్తీలోని లబ్ధిదారుల గణాంకాలు, గత బకాయిలు, ప్రస్తుత వినియోగం స్పష్టంగా వెల్లడించాలి. బిల్లు ఎగవేత, విద్యుత్ దొంగతనం ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలి. ఉచిత పథకం పేరుతో దాన్ని కప్పిపుచ్చకూడదు.
పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించడం.. సబ్సిడీలను లక్ష్యంగా చేసి, నిజమైన పేదలకు మాత్రమే అందేలా సీలింగ్, వెరిఫికేషన్ కఠినం చేయాలి.