Homeజాతీయ వార్తలుకేసీఆర్ తో ఫైట్.. జగన్ తట్టుకుంటాడా?

కేసీఆర్ తో ఫైట్.. జగన్ తట్టుకుంటాడా?


‘కంటబడ్డావా కనికరిస్తానేమో.. వెంటబడ్డావా వేటాడిస్తా’ అన్న సినిమా డైలాగ్ లాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారశైలి ఉంటుందని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. ఇన్నాళ్లు ఏపీ సీఎం జగన్ ను సోదరుడిగా భావించి స్నేహ హస్తం అందించారు కేసీఆర్. కానీ తెలంగాణకే పుల్లలు పెట్టే పరిస్థితి వచ్చేసరికి కేసీఆర్ కూడా ఫ్లేట్ ఫిరాయించాడు. ‘ఇక ప్రాజెక్టులపై తాడో పేడో తేల్చేస్తాం’ అంటూ ఫైర్ అయ్యారు.

Also Read: బీజేపీలోకి మాజీ ఎంపీ రాథోడ్?

నిజానికి ఏపీలో సీఎంగా జగన్ గెలవడానికి ఎన్నికల ముందర కేసీఆర్ అందించిన సహకారం మరువలేనిదంటారు. అందుకే గెలవగానే కేసీఆర్ ఇంటికి జగన్ వచ్చి ఆప్యాయంగా ఇద్దరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులు, సాగునీటి పారుదల, నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీ మొదలైంది.

ఏపీ ప్రభుత్వం.. జగన్ పట్టుబట్టి మరీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో శ్రీశైలం నుంచి నీటిని సీమకు పట్టుకుపోవడం అక్రమమని తెలంగాణ వాదిస్తోంది. తద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎండిపోయి దక్షిణ తెలంగాణకు సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళనగా ఉంది. ఏపీని సీమ ఎత్తిపోతల ఆపమన్నా వినకుండా ముందుకెళుతుండడంతో కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టుకు ఎక్కింది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఆపాలని ఫిర్యాదులు చేసింది. ఇదే కేసీఆర్ కంటగింపుగా మారింది.

నిజానికి గోదావరిలో వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో పోతోంది. దాన్ని పట్టిసీమ ద్వారా రాయలసీమకు తరలించుకుపోవాలని కేసీఆర్ స్పష్టంగా జగన్ కు చెప్పారు. కానీ దాన్ని వినకుండా రాయలసీమ ఎత్తిపోతల పెట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్ లను ఎండబెట్టడంపై కేసీఆర్ సర్కార్ ఆగ్రహంగా ఉంది.

Also Read: అర్థగంటలోనే కరోనా రిజల్ట్!

అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు నీటివాటాలో అన్యాయంపై తాజాగా నినదించారు. నాగార్జున సాగర్ సహా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు ఏపీకే పోయాయని నిప్పులు చెరిగారు. ఇక అపెక్స్ కౌన్సిల్ లోనూ తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయంపై కడిగేస్తానంటూ సర్వం చేస్తున్నారు. వాగ్ధాటి, ఎంతో నైపుణ్యం గల కేసీఆర్ వాదన ముందు ఏపీ సీఎం జగన్ సహా ఏపీ అధికారులు తట్టుకోవడం కష్టమేనన్న వాదన ఉంది. కేసీఆర్ రంగంలోకి దిగితే ఆయనంత పరిజ్ఞానం ప్రాజెక్టులపై ఎవరికి లేదనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ప్రత్యర్థులందరూ తేలిపోవడం ఖాయమంటున్నారు.

ఇప్పుడు సీమ ఎత్తిపోతలకు ధీటుగా తెలంగాణ సర్కార్ శ్రీశైలం నుంచి ఎడమ కాలువ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తరలించే ప్రయత్నాలు ప్రారంభించారు. అలా ఏపీ కొల్లగొట్టే ప్రయత్నాలకు చెక్ చెబుతూ నీటిని నాగార్జున సాగర్ కు తరలించే ఎత్తుగడ సిద్ధం చేశారని తెలిసింది. వృథాగా నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం కూడా తాజాగా కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇలా ఏపీ ప్రయత్నాలకు ధీటుగా కేసీఆర్ తెలంగాణ నీటివాటా కోసం ఎంతకైనా చేయడానికి తొడగొట్టడం తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచింది.

-నరేశ్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular