Revanth Reddy Engineering Education: ఒక సందర్ పిచాయ్ గూగుల్ సీఈవో అయ్యాడు. ఓ శాంతను నారాయణ్ అడోబ్ సీఈవో యాడు.. సత్య నాదెళ్ల.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళు భారతీయులు అయిననంత మాత్రాన.. ఇందులో కొంతమందికి తెలుగు మూలాలు ఉన్నంత మాత్రాన.. అందరి చదువులు గొప్పగా ఉన్నాయని కాదు.
గొప్ప చదువులు చదివిన వారు మాత్రమే గొప్ప స్థానాల్లో ఉంటారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ వీరిని చూసి మిగతావారు మొత్తం ఇలానే ఉంటారు.. భారత్ లో మొత్తం చదువులు ఇలానే ఉంటాయి అని చెప్తే మాత్రం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న సామెత తీరుగానే ఉంటుంది.
మొన్నటికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడాడు. ఇంజనీరింగ్ విద్య అనేది క్రిమినల్ వేస్ట్ అని చెప్పాడు. దీంతో కేటీఆర్.. హరీష్ రావు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో యువతరానికి తాము ప్రతినిధులం అన్నట్టుగా కవరింగ్ ఇచ్చారు. జనరేషన్ జెడ్ తరం కచ్చితంగా రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయాలని పిలుపును కూడా ఇచ్చారు. ఆ కాడికి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ యువతను మొత్తం ఉద్ధరించినట్టు బిల్డప్ ఇస్తున్నారు.
వాస్తవాలు మాట్లాడుకుంటే.. రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు.. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 370 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.. ఈ కాలేజీల నుంచి ప్రతి ఏడాది లక్ష కుమించి గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నారు.. వీరందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. ప్రైవేట్ రంగం తనకు అవసరం ఉన్నంతవరకే తీసుకుంటుంది. పైగా తీసుకునే ఉద్యోగుల్లో నైపుణ్యం కచ్చితంగా ఉండాలి. నైపుణ్యం లేకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటివేస్తుంది.
ఇప్పుడు ఐటీ కంపెనీలు నైపుణ్యంలేని ఉద్యోగులను బయటికి పంపిస్తున్నాయి. వాళ్లకు గులాబీ రంగు స్లిప్పులు ఇచ్చి వెళ్లగొడుతున్నాయి. ఇంజనీరింగ్ అనేది పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగానే ఉండాలి. అలా లేకపోతే ఇంజనీరింగ్ విద్య చదివి ఉపయోగం ఉండదు. ఉదాహరణకు దక్షిణ కొరియాలో అక్కడి కంపెనీల అవసరాలకు ఆధారంగానే ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయి. కంపెనీ భవిత లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయో.. వాటి ప్రకారమే ఎక్కడ సిలబస్ తయారవుతూ ఉంటుంది.. ప్రపంచ ఆటోమొబైల్ రాజధాని జర్మనీలో కూడా ఇదేవిధంగా ఉంటుంది.
అక్కడిదాకా ఎందుకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల మీద ఏకంగా ఒక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని కాలేజిల మీద చర్యలు తీసుకున్నారు. నిండు శాసనసభలో తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య వల్ల జరుగుతున్న అనర్ధాల మీద ఓపెన్ గానే మాట్లాడేశారు. కానీ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ మర్చిపోయారు. హరీష్ రావు విస్మరించారు. కానీ రేవంత్ గుర్తుపెట్టుకున్నారు. అందువల్లే సరైన సమయంలో.. సరైన విధంగా మాట్లాడారు.. ఇంజనీరింగ్ విద్య అనేది క్రిమినల్ వేస్ట్ అని చెప్పేశారు.