చైనాను ఎన్నిసార్లు తిప్పికొట్టినా తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈసారి చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా కదులుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి అరుణాచల్ ప్రదేశ్లో కొంత భూమిని భారత్ దేశ రక్షమంత్రిత్వశాఖ సేకరించింది. చైనా చొరబాట్లను నిరోధించేందుకు ఈ భూమిలో మిలటరీ గారిసన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఎల్ఏసీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యోర్ని-2 గ్రామంలోని భూమిని రక్షణ మంత్రిత్వశాఖ సేకరించింది. అరుణాచల్ప్రదేశ్లోని వెస్ట్ సియాంగ్ జిల్లాలో ఉంది ఈ గ్రామం. ఇక్కడ సేకరించిన భూమిలో మిలటరీ గారిసన్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. సామ్రాజ్యవాద కాంక్షతో యథేచ్ఛగా వ్యవహరిస్తున్న చైనాను దీటుగా తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. న్యింగ్చిలో మౌలిక సదుపాయాలను చైనా పెంచుతోంది. చైనాను ఎదుర్కొనడానికి భారత్ సర్కార్ ఈ భూమిని సేకరించింది.
గ్రామసభ సమావేశం అవసరం లేకుండా రక్షణ, రైల్వేలు, కమ్యూనికేషన్ల కోసం భూమిని సేకరించే అధికారం భూ సేకరణ పునరావాసం, పునః పరిష్కారంలో న్యాయమైన నష్టపరిహారం, పారదర్శకత చట్టం, 2013 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ భూమిని సేకరించేందుకు సముచిత అధికార వ్యవస్థగా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంటూ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది