India Pakistan Border: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తీసుకున్న చర్యలతో దేశంలో ఉగ్ర కదలికలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇటీవలే జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడులు కలకలం చేపాయి. ఓ కానిస్టేబుల్ కాల్చి చంపారు. తర్వాత కూలీలపై కాల్పులు జరిపారు. ఒకరు చనిపోగా, ఒకరు గాయపడ్డారు. ఈ తరుణంలో ఆర్మీ మరింత అలర్ట్ అయింది. ఈ క్రమంలో ఇటీవలి నిఘా సమాచారం ప్రకారం పాకిస్థాన్ భారత సరిహద్దు వెంబడి కీలక ప్రాంతాల్లో 250 చైనా నిర్మిత ఏ–15 ట్రక్–మౌంటెడ్ సెల్ఫ్–ప్రొపెల్డ్ హోవిట్జర్లను మోహరించినట్లు గుర్తించింది. ఇది ఆర్టిలరీ సామర్థ్యాలను గణనీయంగా పెంచే చర్యగా చూడవచ్చు. ఈ వ్యవస్థలు 155 మిమీ క్యాలిబర్తో 72 కిలోమీటర్ల వరకు దూరం కొట్టగలవని, నిమిషానికి ఆరు రౌండ్లు కాల్పులు జరపగలవని తెలుస్తోంది. అధునాతన కంట్రోల్ సిస్టమ్లతో కూడిన ఈ ఫిరంగులు త్వరిత కదలిక సామర్థ్యం కలిగి ఉన్నాయి.
వ్యూహాత్మం వెనుక మతలబు ఏంటి?
ఈ మోహరింపు సరిహద్దు ప్రాంతాల్లో లాంగ్–రేంజ్ కన్వెన్షనల్ స్ట్రైక్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ట్రక్ మీద ఉండటం వల్ల వేగంగా స్థానం మార్చుకుని కాల్పులు జరిపి తిరిగి తప్పుకునే వ్యూహం సాధ్యమవుతుంది. ఇది కౌంటర్–బ్యాటరీ ఫైర్ను తప్పించుకోవడంలో సహాయపడుతుంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు కీలక సెక్టార్లలో పంపిణీ చేయడం వల్ల వివిధ సరిహద్దు ప్రాంతాలపై ఏకకాలంలో ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. 250 యూనిట్లు అనేక ఆర్టిలరీ రెజిమెంట్లకు సరిపోతాయి కాబట్టి, ఇది కేవలం ప్రదర్శన కాకుండా వాస్తవ సామర్థ్య వృద్ధిగా తెలుస్తోంది.
చైనా–పాక్ రక్షణ సంబంధం..
ఏ–15 చైనా తయారీది, పీఎల్ఏలో ఉపయోగించే పీఎల్సీ–181 అప్గ్రేడ్ వర్షన్. పాకిస్తాన్ ఇంతకుముందు ఈ వ్యవస్థలను సేకరించి ఆధునీకరణ కొనసాగిస్తోంది. ఇది రెండు దేశాల మధ్య రక్షణ సహకారం, ఆయుధ సరఫరా, సంయుక్త వ్యాయామాలు వంటి అంశాలను మరింత బలోపేతం చేస్తున్నదని సూచిస్తుంది. ఇటీవల చైనా సైన్యం వార్షికోత్సవం సందర్భంగా పాక్ సైనిక నాయకత్వం చైనాతో సంబంధాలను ‘‘ప్రత్యేకమైనవి, కాలపరీక్షితమైనవి’’ అని వర్ణించడం ఈ సన్నిహిత బంధాన్ని ప్రతిబింబిస్తుంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత..
2025 మేలో జరిగిన భారత త్రిసేవల ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సైన్యం ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ సంఘటనల్లో కొన్ని ఆర్టిలరీ వ్యవస్థలు ఉపయోగించినట్లు నివేదికలు ఉన్నాయి. ప్రస్తుత మోహరింపు ఆ తర్వాతి దశగా చూడవచ్చుసరిహద్దు ఒత్తిడిని నిలబెట్టడం లేదా భవిష్యత్తు ఘర్షణలకు సిద్ధం కావడం.
భారత్ అప్రమత్తం..
భారత్ వద్ద కూడా ఆధునిక ఆర్టిలరీ వ్యవస్థలు (కె9 వజ్ర, ఏటీఏజీ వంటివి) ఉన్నాయి. అయితే పాక్ వైపు ఈ సంఖ్యలో ట్రక్–మౌంటెడ్ లాంగ్–రేంజ్ వ్యవస్థలు వచ్చడం సరిహద్దు ప్రాంతాల్లోని సివిల్, మిలటరీ లక్ష్యాలపై ముప్పును పెంచుతుంది. 72 కిలోమీటర్ల రేంజ్ కొన్ని అంతర్గత ప్రాంతాలను కూడా చేరుకోగలదు. ఇది భారత్ను కౌంటర్–బ్యాటరీ రాడార్లు, మరిన్ని మొబైల్ ఆర్టిలరీ యూనిట్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు, సరిహద్దు నిఘా పెంపు వంటి చర్యల వైపు మళ్లించవచ్చు. దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య ఆయుధ పోటీని మరింత పెరిగే అవకాశం ఉంది.
పాక్ చర్య సరిహద్దు మిలిటరైజేషన్లో మరో అడుగు. ఇది తక్షణ యుద్ధ ప్రకటన కాకపోయినా, ఉద్రిక్తతను పెంచి దౌత్య, రక్షణ రంగాల్లో జాగ్రత్తలు పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. భారత్ తన రక్షణ సిద్ధతను నిరంతరం అప్డేట్ చేస్తూ, సరిహద్దు స్థిరత్వం కోసం దౌత్య మార్గాలను కూడా కొనసాగించాల్సి ఉంటుంది. ప్రాంతీయ భద్రతకు ఇలాంటి ఆయుధ పోటీలు సవాలుగా మారుతున్నాయి.