ఒకప్పటి భారత్ వేరు.. నేటి భారత్ వేరు.. ఇప్పుడు ఏ దేశంతోనైనా సై అంటే సై అనాల్సిందే. ఇప్పటికే సరిహద్దుల్లో పనికిరాని పన్నాగాలు పన్ని దెబ్బతిన్న చైనాకు మరో పరాజయం ఎదురైంది. సరిహద్దుల్లో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న చైనాపై భారత్ ఓ చిన్న విజయం సాధించింది. అది యుద్ధంలో కాదు.. ఐక్యరాజ్య సమితి ఎన్నికల్లోనే.
Also Read: న్యాయవ్యవస్థలోనూ అమరావతి భూకుంభకోణం లింకులు?
లైంగిక సమానత్వం, మహిళా సాధికారత లక్ష్యంగా పని చేసే మహిళల స్థాయికి సంబంధించిన ఐరాస కమిషన్లో భారత్ సభ్యురాలిగా ఎన్నికైంది. ఐక్యరాజ్య సమితిలో ప్రతిష్ఠాత్మక కమిషనర్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ విమెన్ (సీఎస్డబ్ల్యూ)లో 54 మంది సభ్యులుంటారు. ఆసియా పసిఫిక్ కేటగిరీకి సంబంధించి రెండు ఖాళీలు ఏర్పడగా.. వాటికి సోమవారం ఎన్నికలు జరిగాయి.
ఈ స్థానాల కోసం భారత్, చైనా, అఫ్ఘానిస్థాన్ పోటీ పడ్డాయి. ఇందులో అఫ్ఘానిస్థాన్ 39, భారత్ 38 ఓట్లు సాధించాయి. ఐరాసలో శాశ్వత సభ్యత్వ దేశమైన చైనాకు కేవలం 27 ఓట్లు మాత్రమే వచ్చారు. కనీసం సగం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. దీంతో చైనా మీద భారత్ గెలుపు సాధించింది.
Also Read: ఆశ్చర్యం.. మన ఎంపీలు జీతాల్లో కోత?
ఇదిలా ఉండగా.. భారత్, అఫ్ఘాన్ సభ్యులు నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.సీఎస్డబ్ల్యూ సభ్యదేశంగా భారత్ ఎన్నికైందని, లైంగిక సమానత్వం, మహిళా సాధికారత దిశగా చేసే కృషికి ఇది తిరుగులేని గుర్తింపని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే, ఐరాస ఎకనామిక్ మరియు సోషల్ కౌన్సిల్లో భాగమైన కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవల్పమెంట్(సీపీడీ), కమిటీ ఫర్ ప్రోగ్రామ్ అండ్ కో ఆర్డినేషన్ (సీపీసీ)లోనూ భారత్ ఒక్కో సీటు సాధించింది.