ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. రికవరీ కేసుల సంఖ్య తగ్గుతూ.. మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వారం కిందటి వరకు 15 వేల లోపే ఉన్న కేసుల సంఖ్య.. ఒకే సారి 20 వేలు దాటిపోయింది. గత 24 గంటల్లో ఒక లక్ష 14 వేల 299 మందిని పరీక్షించగా.. 23,920 మందికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. 88 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
ఈ పరిస్థితికి అత్యంత ప్రమాదకరమైన మ్యుటెంటే కారణమని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గర్తించినట్టు సమాచారం. N-440K పిలిచే ఈ రకం వైరస్ బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దాని కారణంగానే బాధితుల సంఖ్య పెరుగుతోందని సీసీఎంబీ అంచనా వేసినట్టు సమాచారం.
గతేడాది మొదటిసారి వెలుగు చూసిన కొవిడ్-19కు.. ఇప్పటి వైరస్ లకు పోలికే లేదని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎన్నో వేరియంట్లుగా వైరస్ రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. బ్రిటన్, బ్రెజిల్, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ప్రమాదకర వేరియంట్ల మాదిరిగానే ఏపీలోని N-440K రకం వైరస్ ప్రమాదకరంగా మారుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే పరిస్థితి చేయిదాటకుండా ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూ కూడా ప్రకటించిందని తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలు తెరవాలని సర్కారు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.