CM Jagan: ఏపీ సీఎం జగన్ మరోసారి పవన్ పై విరుచుకుపడ్డారు. ఆయన వ్యక్తిగత జీవితం పై మాట్లాడారు. తెలంగాణలో జనసేన ఓటమిని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అనేది ఒక పార్టీయేనా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇండిపెండెంట్ లకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని చులకనగా మాట్లాడారు. అటువంటి పార్టీ ఏపీలో తమకు పోటీయేనా అని ప్రశ్నించారు. ఇటీవల సీఎం జగన్ ఏ జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం పవన్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర దుమారం రేపుతున్నాయి.
గతంలో ఓ జిల్లా పర్యటనకు విచ్చేసినప్పుడు పవన్ ను ఉద్దేశించి జగన్ దారుణంగా మాట్లాడారు. దత్తపుత్రుడిగా అభివర్ణించారు. ఆయన శాశ్విత నివాసం హైదరాబాదులో కానీ… ఆయన ఇంట్లో ఇల్లాలు ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి మారుతుంటుందని ఎద్దేవా చేశారు. ఒకసారి లోకల్, ఇంకోసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్ అంటూ విమర్శనాస్త్రాలను సంధించారు. ఇక ఆ తర్వాత ఎక్కడికి పోతాడో అంటూ ప్రశ్నించారు. ఆడవాళ్లు అన్నా, వివాహ వ్యవస్థ అన్నా.. దత్తపుత్రుడికి గౌరవం లేదంటూ తేల్చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీశాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. బిజెపితో పొత్తులో భాగంగా బరిలో నిలిచింది. అయితే ఎక్కడా కూడా జనసేనకు డిపాజిట్లు రాలేదు. అక్కడి అపజయాన్ని ప్రస్తావిస్తూ జగన్ తాజాగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ” ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగ్ కొట్టాడు ఈ ప్యాకేజీ స్టార్… మ్యారేజ్ స్టార్.. ఆంధ్రకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడు పార్టీకి రాలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదు” అని జగన్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే విషయంపై గతంలో వైసిపి నేతలు కూడా విమర్శలు సంధించారు. అప్పట్లో బర్రెలక్క దీనిపై స్పందించారు. ప్రజలకు సేవ చేయడానికి నిజాయితీగా వచ్చిన పవన్ అన్నతో తనను పోల్చడం సరికాదని.. కానీ తనకు ఇది ఆనందం ఇస్తుందని.. ఏదో ఒక రోజు పవన్ అధికారంలోకి రావడం ఖాయమని బర్రెలక్క చెప్పడం విశేషం.