AP BJP President Purandeswari
AP BJP President Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి హై కమాండ్ షాక్ ఇచ్చింది. ఆమె పంపిన నూతన కార్యవర్గం జాబితాను పక్కన పడేసింది. గత నెలలో ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో పూర్తిస్థాయిలో తన మార్కు చూపించేలా కార్యవర్గాన్ని ఆమె రూపొందించుకున్నారు. అధిష్టానానికి పంపించారు. అయితే కారణాలు తెలియదు గానీ హై కమాండ్ ఆ జాబితాను పక్కన పడేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఏడాది కావడంతో హై కమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. బిజెపికి సాధారణంగా రాష్ట్రంలో అధ్యక్షుడితో పాటు నలుగురు ప్రధాన కార్యదర్శిలు, పదిమంది ఉపాధ్యక్షులు, మరో పదిమంది కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉంటారు. ఈ పదవులతో పాటు బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, మహిళా, కిసాన్, యువమోర్చా అధ్యక్షులను రాష్ట్ర అధ్యక్షులు నియమిస్తారు. కేంద్ర నాయకత్వం కార్యనిర్వాహక కార్యదర్శి నియమిస్తుంది.
అయితే రాష్ట్ర కమిటీ లో ప్రస్తుతం ఉన్న నాయకుల్లో చాలామందికి ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పురందేశ్వరి తన మార్క్ ఉండేలా జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. కీలకమైన ప్రధాన కార్యదర్శుల పదవుల్లో రాయలసీమ నుంచి బైరెడ్డి శబరి, ఉత్తరాంధ్ర నుంచి కాశి రాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీసీలకు సంబంధించి నెల్లూరు జిల్లాకు చెందిన గౌడ, కర్నూలు జిల్లాకు చెందిన వాల్మీకి సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్డీవిల్సన్ ను సైతం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు ఉపాధ్యక్ష పదవి ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర యువ మార్చా అధ్యక్షడిగా ఉన్న సురేంద్రమోహన్ ను తప్పిస్తారని సమాచారం. ఆయన కార్యదర్శిగా తీసుకొని.. ఆ స్థానంలో పనతల సురేష్ను నియమిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి గత నెల 31న నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తారని బిజెపి వర్గాలు భావించాయి. కానీ రాష్ట్ర కమిటీ నుంచి వెళ్లిన జాబితాను అధినాయకత్వం పక్కన పడేసింది. బిజెపిలో వర్గ పోరే ఇందుకు కారణం అని తెలుస్తోంది. గతంలో సోము వీర్రాజు బృందంలో చాలామందికి కోత పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో హై కమాండ్ పునరాలోచనలో పడింది. సీనియారిటీ, సామాజిక వర్గాల సమతుల్యత తదితర వాటిని పరిగణలోకి తీసుకొని.. త్వరలో నూతన కమిటీ నీ ప్రకటించనున్నట్లు సమాచారం.