ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ మేనియా కొనసాగుతోంది. ఒకే ఒక్క ట్రైలర్ తో ఆకాశంలో ఉందీ సినిమా. ఆ బజ్ ను రిలీజ్ అయ్యే వరకూ అక్కడే ఉంచాలని ట్రై చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇందులో భాగంగా.. బంబాట్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశాడు. కానీ.. పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు.
సినిమా ప్రమోషన్ మరింత భారీగా నిర్వహించాలని ఈవెంట్ ప్లాన్ చేసిన నిర్మాత.. ఈ కార్యక్రమానికి రావడానికి పవన్ ను కూడా ఒప్పించారు. గెస్టులుగా మెగా స్టార్, మెగా పవర్ స్టార్ రావడం కూడా ఖరారైపోయింది. ఇక, కార్యక్రమం నిర్వహించడమే ఆలస్యం అన్నట్టుగా ఎదురు చూశారు ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 3వ తేదీన యూసుఫ్ గూడ ఓలీస్ లైన్స్ లోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో వేడుక నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు అనుమతి కోరుతూ పోలీసులకు లేఖరాశారు. కానీ.. కరోనా కారణంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ… కేవలం 5 వేల మందికి మాత్రమే పాసులు ఇచ్చి కార్యక్రమం చేసుకుంటామన్నా.. వారు అంగీకరించలేదు.
దీంతో.. ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. చిరు, పవన్, చెర్రీని ఒకే వేదికపై చూసి చాలా కాలం అవుతోందని, పవన్ కమ్ బ్యాక్ మూవీ ఈవెంట్లో వారిని చూడాలని ఎంతో ఆశపడ్డారు. కానీ.. అనుమతి రాకోవడంతో నిరాశలో కూరుకుపోయారు. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజు వెనక్కు తగ్గట్లేదని తెలుస్తోంది.
ఈ వేడుక కోసం మరో ప్లాన్ వేస్తున్నారని సమాచారం. కానీ.. పోలీసులే అనుమతి నిరాకరించిన తర్వాత ఏం చేస్తారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఓ స్టార్ హోటల్ లో పరిమిత సంఖ్యలో ఆహ్వానించి, కార్యక్రమం నిర్వహిస్తారని సమాచారం. వేడుక అసలు నిర్వహించకుండా ఉండే బదులు.. ఏదో ఒక కార్యక్రమం చేయడం మేలు కదా అని భావిస్తున్నాడట నిర్మాత. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.