Janasena Party: ఆంధ్రప్రదేశ్లోని కూటమి పాలనలో టీడీపీ తర్వాత రెండో పెద్ద మిత్రపక్షంగా జనసేన నిలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేసినా, అన్నింటినీ గెలుచుకుని వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ విజయం వెనుక పొత్తు ఒప్పందాన్ని పూర్తిగా పాటించడమే కీలకం.
ముగ్గురికి మంత్రి పదవులు..
ఎన్నికల్లో జనసేన పొత్తుధర్మం పాటించడంతోపాటు, వైసీపీని ఓడించడంలో టీడీపీని గెలిపించడంలో కీలకపాత్ర పోషించింది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిర్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం జనసేకు చెందిన 21 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురికి కేబినెట్లో స్థానం కల్పించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఉపముఖ్యమంత్రి పదవితోపాటు ఐదు ముఖ్యమైన శాఖలు అప్పగించారు. నాదెండ్ల మనోహర్కు పౌరసరఫరాలు, కందుల దుర్గేష్కు పర్యాటక శాఖ దక్కాయి. ఈ ముగ్గురూ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరో మంత్రి పదవి హామీ..
జనసేనకు మరో మంత్రి స్థానం ఇస్తామన్న హామీ ఉందని పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. గతేడాది నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కకపోవడంతో, ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఆ అదనపు స్థానం జనసేనకే చెందుతుందని అంతర్గత చర్చలు సాగుతున్నాయి.
నాగబాబు అవకాశాలు..
నాగబాబు గతేడాది మార్చి 30న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చట్టసభ సభ్యుడిగా మంత్రి పదవికి అర్హత ఉంది. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రులు ఉండటం, అలాగే ఇప్పటికే ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఉండటం వల్ల విమర్శలు రావచ్చని పార్టీలో ఆలోచన ఉంది. దీంతో ఇతర నాయకుల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి.
ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం..
జనసేన నాయకత్వం ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో మంత్రి పదవిని ఆ ప్రాంతానికే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా బీసీ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కూడా ఉందని చర్చలు జరుగుతున్నాయి.
ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పోటీ..
ఉత్తరాంధ్రలో జనసేనకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బీసీ వర్గానికి చెందిన ఇద్దరు ముందంజలో ఉన్నారు. కొణతాల రామకృష్ణ: సీనియర్ నాయకుడు, గవర సామాజిక నేపథ్యం, రాజకీయ అనుభవం, వ్యూహాత్మక దృష్టి కలిగినవారు.
వంశీ కృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం దక్షిణం నుంచి ఎన్నికైన యువనేత, యాదవ సామాజిక వర్గం. నగరంలో ఆ వర్గం బలం ఎక్కువగా ఉండటం పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది.
అనుభవం పరిగణనలోకి తీసుకుంటే కొణతాలకు, యువతకు అవకాశం ఇవ్వాలనుకుంటే వంశీకి అవకాశం ఉంటుందని విశ్లేషకులు, పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి ఆ పదవి దక్కుతుందన్నది త్వరలోనే స్పష్టమవుతుంది.