AP MLC Elections: ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇది జరిగి రెండు వారాలు దాటుతోంది. కానీ ఇంతవరకు కొత్త ఎమ్మెల్సీల ఎంపిక అనేది జరగలేదు. దీనిపై చర్చ నడుస్తోంది. గత నెల 28న గవర్నర్ కోటా కింద ఎంపికైన ఎమ్మెల్సీలు జాకీయాఖానం, పండు రవీంద్రలు పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనేది అనివార్యం. అయితే గవర్నర్ కోటా కింద ఎంపిక జరిగే ఎమ్మెల్సీలు కచ్చితంగా ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఈరోజు భర్తీ జరుగుతుందో ఆ రోజు నుంచి లెక్క కడతారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో జాప్యం చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. మరోవైపు లోలోపల కసరత్తు ప్రారంభం అయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రధానంగా ఈసారి ఇద్దరు సీనియర్లకు ఛాన్స్ కల్పిస్తారని ప్రచారం సాగుతోంది.
* రెండు పదవులు టిడిపికే..
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. ఈ క్రమంలో పదవులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లను తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని భాగస్వామ్య పార్టీలైన భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన నాయకత్వానికి చంద్రబాబు తెలిపినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో రాజ్యసభతో పాటు ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఆ రెండు పార్టీలకు భాగస్వామ్యంగా అవకాశాలు కల్పించారు చంద్రబాబు. కానీ ఈసారి టిడిపిలో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో తమ పార్టీ ఆ రెండు పదవులు తీసుకోవాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అందుకు ఆ రెండు పార్టీలు సైతం అంగీకారం తెలిపినట్లు ప్రచారం సాగుతోంది.
* ఆశావహులు అధికం..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవుల ఆశావహుల జాబితా చాలా వరకు ఉంది. పదిమందికి పైగా ఈ జాబితాలో ఉన్నారు. అయితే గవర్నర్ కోటా కింద ఇద్దరు సీనియర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తొలుత రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వాటన్నింటినీ తెరదించుతూ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మొన్ననే ఆయన ఎమ్మెల్సీగా రిటైర్ అయ్యారు. రాజ్యసభ పదవి దక్కుతుందని అంత అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన పేరు లేకుండా పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరు పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే రాష్ట్రస్థాయిలో అన్ని పదవులు చేపట్టిన యనమల మళ్లీ ఎమ్మెల్సీ పదవి అంటే తీసుకుంటారో లేదో చూడాలి. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వస్తున్నారు యనమల. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఒకసారి మాత్రం అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. 2024లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్సీగా ఉన్న యనమలకు చాన్స్ లేకుండా పోయింది. రాష్ట్రస్థాయిలో పదవులు అనుభవించిన ఆయనకు చివరిగా పెద్దల సభకు వెళ్లాలన్నది కోరిక. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని ఆయన తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.
* దేవినేని ఉమాకు..
మరో ఎమ్మెల్సీ పదవికి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన ఉమామహేశ్వరరావు 1999 నుంచి 2014 వరకు అన్ని ఎన్నికల్లో గెలిచారు. 2014లో గెలిచేసరికి చంద్రబాబు తన క్యాబినెట్లో కీలకమైన భారీ నీటిపారుదల శాఖను అప్పగించారు. 2019లో ఓడిపోయిన ఉమామహేశ్వరరావు 2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం తన సీటును త్యాగం చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..