YSR Congress Party: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో ఒకరకమైన బెంగ కనిపిస్తోంది. వారికి పార్టీ భవిష్యత్ కంటే.. తమ పిల్లల భవిష్యత్తును సెట్ చేయడమే ఒక కర్తవ్యంలా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి చూస్తే ఏమంత బాగాలేదు. పైగా అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి గురించి వారికి తెలియనిది కాదు. అందుకే ఎక్కువ మంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నారు. అక్కడ పార్టీ పరిస్థితి మెరుగుపడిందా? పర్వాలేదు. లేకుంటే పార్టీని వదిలి సేఫ్ జోన్ లో తమ వారసులను నిలపాలన్న ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది. 2029 ఎన్నికలు దాటితే చాలామంది ఏడుపదుల వయసు దాటుతారు. అప్పటికి తమ వారసుల రాజకీయ భవిష్యత్తు సెట్ అవుతుందా? లేదా? అనే అనుమానంతో ఉన్నారు.
* సీనియర్ నేతల ఆరాటం..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ధర్మాన బ్రదర్స్, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం లాంటి నేతలు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లోనే తమ పిల్లలకు టికెట్లు ఇవ్వాలని ధర్మాన బ్రదర్స్ కోరారు. కానీ అందుకు జగన్ అంగీకరించలేదు. అయితే ఇప్పుడు 2029 ఎన్నికల వరకు వేచి చూసే కంటే.. స్థానిక ఎన్నికల్లోనే తమ పిల్లలను బరిలో దించాలని ధర్మాన బ్రదర్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మాన కృష్ణ దాస్ కుమారుడిని జిల్లా పరిషత్ చైర్మన్ గాను.. ధర్మాన ప్రసాదరావు కుమారుడ్ని శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ గాను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో అక్కడ వచ్చే ఓట్ల ప్రభావం, ఫలితాలను అంచనా వేసుకుని 2029 ఎన్నికల నాటికి ఏదో ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నది ధర్మాన బ్రదర్స్ ఆలోచనగా తెలుస్తోంది.
* కుమార్తె కోసం బొత్స..
శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయినా సరే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దానికి కారణం వారసులను రాజకీయంగా సెట్ చేయడమే. కుమార్తెతో పాటు కుమారుడు ఇద్దరూ వైద్యులే. కానీ ఇంతవరకు వారు పొలిటికల్ గా సెట్ కాలేదు. అందుకే తన కుమార్తె డాక్టర్ అనూషను జిల్లా పరిషత్ చైర్మన్ గాను.. కుమారుడు సందీప్ ను చీపురుపల్లి ఎమ్మెల్యే గారు చూడాలనుకుంటున్నారు బొత్స. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో తన కుమార్తె పేరును జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కోసం జగన్ ఎదుట ప్రతిపాదన పెట్టారు. మరోవైపు తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటే తన కుమారుడికి జిల్లా పరిషత్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు తమ్మినేని. అయితే ఈ సీనియర్లంతా అంతిమంగా ఒకటే ఆలోచన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓట్లు, గ్రాఫ్ పెరిగితే పరవాలేదు.. లేకుంటే మాత్రం పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడమనే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..