Amadalavalasa YSRCP: నాయకులే చిక్కుల్లో ఉంటే కార్యకర్తల పరిస్థితి ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీలో పరిస్థితి అదే. ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫ్యామిలీ ఓబు వివాదంలో చిక్కుకుంది. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న చింతాడ రవికుమార్ మహిళా పోలీస్ అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో చిక్కుకున్నారు. మొన్నటి వరకు తమ్మినేని సీతారాం తో పాటు ఆయన భార్య పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ దక్కడంతో వారు బయటకు కనిపిస్తున్నారు. కుమారుడు చిరంజీవి నాగ్ మాత్రం ఇంకా పరారీ లోనే ఉన్నారు. మరోవైపు చింతాడ రవికుమార్ సైతం పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
* భూ వివాదంలో..
ఆమదాలవలస నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉంటుంది శ్రీకాకుళం నగరం. అక్కడ ఓ భూ యజమాని ఉండగా.. ఆయన వారసుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి తన కుమారుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తమ్మినేని సీతారాం పై కేసు నమోదయింది. దాదాపు నాలుగు కోట్ల రూపాయల భూమికి సంబంధించి తమ్మినేని తో పాటు ఆయన భార్య, కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమ్మినేని ఫ్యామిలీ తప్పు చేసినట్లు నిర్ధారిస్తూ కేసులు నమోదు చేయడంతో వారు పరారీ అయ్యారు. దాదాపు ఓ వారం రోజుల పాటు కనిపించకుండా పోయిన తమ్మినేని సీతారాం తో పాటు ఆయన భార్యకు హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చింది. దీంతో వారు విచారణకు హాజరయ్యారు. కానీ ఇంకా వారి కుమారుడి ఆచూకీ లేదు.
* ఎస్సై పై అనుచిత ప్రవర్తనతో..
మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత ఆమదాల వలస నియోజకవర్గ బాధ్యతలను యువనేత చింతాడ రవికుమార్ కు అప్పగించారు జగన్. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ్మినేని కొద్ది రోజులపాటు అసంతృప్తితో గడిపారు. కానీ తర్వాత యాక్టివ్ అయ్యారు. చింతాడ రవికుమార్ తో మాత్రం కలిసి పని చేయడం లేదు. అయితే మొన్ననే మాజీ మంత్రి అప్పలరాజు జైల్లో ఉండగా పరామర్శకు వచ్చారు జగన్. విశాఖ నుంచి బలప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో ఆమదాల వలస నియోజకవర్గం నుంచి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ఎస్సై పై వైసీపీ శ్రేణులు అనుచితంగా ప్రవర్తించాయి. అయితే అక్కడే ఉన్నారు రవికుమార్. దీంతో పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. చింతాడ రవికుమార్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కేసు నమోదు చేసింది. చింతాడ రవికుమార్ అరెస్ట్ తప్పకుండా ఉంటుందన్న ప్రచారం జరిగింది. దీంతో ఆయన పరారీ అయ్యారు. అయితే వరుసగా ఒకే నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు కేసుల్లో చిక్కుకోవడం.. పరారీలో ఉండటంతో వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి.