Palasa Special Trains: రైల్వే లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. అందులో భాగంగా ఆగస్టులో ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణా కోసం జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విజయవాడ నుంచి పలాస మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్, స్టాపులతో పాటు ఇతర వివరాలను దక్షిణ కోస్తా రైల్వే ఈరోజు విడుదల చేసింది.. రైల్వే పోస్టులకు గాను పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు వాటిని గమనించి.. సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ అధికారులు కోరుతున్నారు.
* నాలుగు రోజులపాటు..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు సంబంధించి ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు షెడ్యూల్ విడుదల చేసింది రైల్వే శాఖ. అందుకే ఐదు రోజులపాటు పలాస నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ. అయితే ఇవన్నీ అన్ రిజర్వుడ్ రైళ్లే. నేరుగా టిక్కెట్ తీసుకుని ప్రయాణం చేయవచ్చు. ఈనెల రెండు నుంచి పలాస నుంచి విజయవాడకు రోజుకు నాలుగు ట్రిప్పులు చొప్పున ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి పలాస కు ఈనెల 3 నుంచి 6 వరకు మరో నాలుగు రైళ్లు.. నాలుగు ట్రిప్పుల చొప్పున అందుబాటులో ఉంటాయి.
* షెడ్యూల్ ఇదే..
పలాస నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరుతుంది ఈ ప్రత్యేక రైలు. శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు మీదుగా విజయవాడకు అర్ధరాత్రి ఒంటిగంటకు చేరుతుంది. అలాగే విజయవాడ నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరే ఈ ప్రత్యేక రైలు ఇవే స్టేషన్ల మీదుగా మరుసటి రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు పలాస చేరుకుంటుంది. ఇందులో ప్రతి రైలులోను 10 జనరల్, రెండు స్లీపర్ క్లాస్ తో కూడిన మొత్తం 12 బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ అయ్యాయి.