Tammineni Seetharam: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. వారికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు. అలాగని వారు పార్టీని విడిచి పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే వారిని ఇతర పార్టీలు తీసుకోవు కూడా. వారు చేరని పార్టీ ఉండదు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ గడప తొక్కారు. అక్కడ కాదంటే మిగతా పార్టీలకు వెళ్లే అవకాశం లేదు. అందుకే ఎన్ని రకాల అవమానాలు జరిగిన అక్కడే ఉండాల్సిందే. అలాంటి అవమానాలు ఎదుర్కొని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంట్లో పడాలని చాలామంది నేతలు ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఎంతలా రచ్చ చేయాలో అంతలా చేశారు. ఇప్పుడు ఆ వంతు తమ్మినేని సీతారాం కు వచ్చింది.
* శాసనమండలిలో మాటల యుద్ధం..
శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ గట్టిగానే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు, టిడిపి మంత్రి కింజరాపు అచ్చం నాయుడు మధ్య గట్టి మాటలు యుద్ధం నడిచింది. డీఎస్సీ 2025 విషయంలో ఆరోపణలు చేసిన బొత్సను ఉద్దేశించి అచ్చం నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపి హయాంలో ఐదేళ్లపాటు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఏం వెలగబెట్టారని.. ఇప్పుడు డీఎస్సీ 2025 పై విషం చిమ్ముతున్నారని.. అప్పుడు ఏం చేయలేని దద్దమ్మ అంటూ సంబోధించారు. దీనిపై గట్టిగానే రియాక్ట్ అయ్యారు బొత్స. నీలా ఎద్దులా పెరగలేదు అంటూ బదులిచ్చారు. దీంతో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. శాసనమండలిలో ఆంబోతు అంటూ సంబోధిస్తూ.. బయట మీడియాతో సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకే అనే టాక్ ఉంది.
* పట్టించుకోని జగన్..
అయితే ఇప్పుడు సీన్లోకి వచ్చారు తమ్మినేని సీతారాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్పీకర్గా వ్యవహరించిన తమ్మినేని అనే నేతను పూర్తిగా పక్కన పెట్టారు జగన్. ఆయన స్థానంలో చింతాడ రవికుమార్ అనే నేతకు నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టారు. మొన్ననే ఓ భూ వివాదంలో చిక్కుకుంది తమ్మినేని ఫ్యామిలీ.. అరెస్టు భయంతో పరారైంది. ఎలాగోలా ముందస్తు బెయిల్ దక్కడంతో బయటపడింది. అయితే అదే సమయంలో మాజీ మంత్రి అప్పలరాజుకు సంబంధించిన వివాదం నడిచింది. అయితే అప్పలరాజుకు పరామర్శించేందుకు వచ్చిన క్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ సైతం ఓ మహిళ ఎస్సై పై అనుచిత ప్రవర్తన కేసులో అరెస్ట్ అయ్యారు. అటు అప్పలరాజు, ఇటు చింతాడ రవికుమార్ విషయంలో స్పందించిన జగన్ మోహన్ రెడ్డి.. తమ్మినేని సీతారాం విషయంలో మాత్రం పక్కన పెట్టేసారు. కనీసం స్పందించలేదు సరి కదా.. ఫోన్ చేసి పరామర్శించలేదు కూడా. ఇంత జరిగినా తమ్మినేని మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాల్సిన అనివార్య పరిస్థితి. ఇప్పుడు అచ్చం నాయుడు ఎపిసోడ్ ను అడ్డం పెట్టుకుని ఏకంగా మీడియా ముందుకు వచ్చి ఆయనపై విమర్శలు చేశారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం అనేది బహిరంగ రహస్యం..