Chintada Ravi: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది పరారీలో ఉన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో వారిపై కేసులు నమోదయ్యాయి. అటువంటివారు పోలీసులకు దొరకకుండా పరారీలో ఉండడం విశేషం. ముఖ్యంగా ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలు ఉండడం గమనార్హం. తొలుత ఓ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి మాజీ మంత్రి అప్పలరాజు, శ్రీకాకుళం నగరంలో ఆస్తి వివాదానికి సంబంధించి మాజీ స్పీకర్ తమ్మినేని, ఇప్పుడు తాజాగా ఓ మహిళ ఎస్సై పై అనుచిత ప్రవర్తన పై.. ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ పరారీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందులో మాజీ స్పీకర్ తమ్మినేని కి ఉపశమనం లభించింది. కానీ ఆయన కుమారుడుకు మాత్రమే ఇంతవరకు బెయిల్ లభించలేదు. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ నేతలు ఇప్పుడు పరారీలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను ఎక్కడికి వెళ్లి పోలేదని.. శ్రీకాకుళంలోనే ఉన్నానంటూ చింతాడ రవికుమార్ వీడియో బయటకు విడుదల చేయడం విశేషం.
* పరామర్శకు వచ్చే క్రమంలో..
శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మాజీ మంత్రి అప్పలరాజు. ఆయనను పరామర్శించేందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో బల ప్రదర్శనగా వచ్చారు. ఈ క్రమంలో శ్రీకాకుళం సమీపంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ క్రమంలో ఓ మహిళ ఎస్సై విషయంలో వైసీపీ శ్రేణులు అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియోలు కూడా బయటకు రావడం.. అందులో చింతాడ రవికుమార్ ఉండడంతో ఆయనపై కేసు నమోదయింది. అయితే ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు.
* తాజాగా వీడియో..
ఆ మహిళా ఎస్సై తన తోబుట్టువుతో సమానం అని చెబుతున్నారు రవికుమార్. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఆరోజు మానవతా హృదయంతో ఆమెను పక్కకు తీసుకెళ్లామే తప్ప.. ఎటువంటి అనుచిత ప్రవర్తనకు దిగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా ప్రభుత్వ కుట్రగా అభివర్ణించారు. తమ వారిపై అక్రమంగా నమోదు చేసిన కేసులను రద్దు చేసిన మరుక్షణం తాను లొంగిపోతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం చింతాడ రవి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు చింతాడ రవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. శ్రీకాకుళంలోనే ఉన్న ఆయన పట్టు పడకపోవడం విశేషం. మరోవైపు తమ్మినేని కుమారుడు సైతం పరారీలో ఉన్నారు. ఇంతవరకు ఆయన ఆచూకీ లేదు.