Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: టిడిపి, జనసేనల మధ్య వైసీపీ కుట్ర.. పిఠాపురంలో పవన్ మకాం!

Pawan Kalyan: టిడిపి, జనసేనల మధ్య వైసీపీ కుట్ర.. పిఠాపురంలో పవన్ మకాం!

Pawan Kalyan: ఏపీలో మరో దశాబ్ద కాలం పాటు మూడు పార్టీల మధ్య పొత్తు కొనసాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ సైతం అదే భావనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసిపికి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. గత ఐదేళ్లపాటు అవకాశం ఇచ్చి రాష్ట్రం నాశనం అయ్యిందని అభిప్రాయపడుతున్నారు. అందుకే మూడు పార్టీలను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు వారిద్దరు. ఇప్పటికే కేంద్ర పెద్దలతో ఈ విషయం చర్చించారు. మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం కీలక చర్చలు జరిపారు. అయితే అధినేతలు ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ పరిస్థితి ఉండడంతో ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోంది. దీంతో అక్కడ దిద్దుబాటు చర్యలకు పవన్ ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి రెండు రోజులపాటు పిఠాపురం లోనే పవన్ ఉండనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీతో జనసేన సమన్వయం, వైసీపీ ప్రోద్బలంతో జరుగుతున్న విభేదాల పర్వం పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశంతో జనసేన జత కట్టడం వైసిపికి ఇష్టం లేదు. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల వైసిపి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ పిఠాపురంలో రెండు రోజుల పాటు మకాం వేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

* రెండు వారాలు గడవకముందే
గత నెలలో పిఠాపురంలో పర్యటించారు పవన్. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో పాల్గొన్నారు. రెండు వారాలు గడవకముందే మరోసారి పవన్ పిఠాపురం వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి వర్సెస్ జనసేన అన్నట్టు పరిస్థితి మారిపోయింది. నాయకుల మధ్య దాడులు కూడా చోటు చేసుకుంటున్నాయి. టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మపై ఇప్పటికి రెండుసార్లు దాడికి ప్రయత్నాలు జరిగాయి. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల సమావేశంలో సైతం జనసేన నాయకులు దూకుడు ప్రదర్శించారు. అయితే కొంతమంది వైసీపీ నేతలు జనసేనలోకి ఎంట్రీ ఇచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.

* నేడు పిఠాపురానికి పవన్
పిఠాపురం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని.. రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వానికి సైతం సమాచారం ఉంది. అందుకే పవన్ పిఠాపురంలో పర్యటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పూర్తిస్థాయిలో అక్కడ జరుగుతున్న విషయాలపై ఆరా తీసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు, తెర వెనుక ఉన్న అంశాలను బయటకు తీస్తారని తెలుస్తోంది. పనిలో పనిగా కూటమి పార్టీల సమన్వయ సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని.. మూడు పార్టీల శ్రేణులకు కీలక ఆదేశాలు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular