Pawan Kalyan Cabinet Meeting: ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వరుసగా మూడు సార్లు క్యాబినెట్ సమావేశాలకు హాజరు కాకపోవడమంటే చాలా పెద్ద విషయమే. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న సచివాలయంలో మూడున్నర గంటల పాటు సాగిన క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం పై సోషల్ మీడియా లో ప్రతిపక్షానికి చెందిన మీడియా చానెల్స్ తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ , కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అభిమానులను , కార్యకర్తలను భయాందోళనలకు గురి చేసే కథనాలను ప్రచురించారు. జనసేన , టీడీపీ పార్టీల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని , స్థానిక సంస్థల సీట్ల పంపకాల విషయం లో టీడీపీ జనసేన మధ్య వాగ్వాదాలు జరిగాయని, అప్పటి నుండి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు తో సరిగా మాట్లాడడం లేదని , క్యాబినెట్ సమావేశాలకు కూడా అందుకే హాజరు కావడం లేదంటూ ప్రత్యేక కథనాలు తమ మీడియా చానెల్స్ ద్వారా ప్రచారం చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశాలకు హాజరు కాకపోవడానికి సరైన కారణం ఉంది. అది ఏమిటంటే ఆయన వెన్ను నొప్పితో చాలా బాధ పడుతున్నాడు. రీసెంట్ గానే గత పదేళ్ల నుండి తనని బాధిస్తున్న భుజం నొప్పికి శాశ్వత పరిష్కారం కోసం ముంబై లో సర్జరీ చేయించుకున్నారు. డాక్టర్లు ఆయన కుడి భుజానికి విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి, 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే వాళ్ళ నుండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంగళగిరి లోని తన క్యాంప్ ఆఫీస్ లో తన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాడు. డాక్టర్లు అరగంట కి మించి కుర్చీ లో కూర్చోరాదని సూచించడం తో , వాళ్ళ ప్రోటోకాల్స్ ని అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన విధులను నిర్వహిస్తున్నారు. క్యాబినెట్ మీటింగ్ అంటే కచ్చితంగా కనీసం 3 గంటల సమయం పడుతుంది.
ఒక్కోసారి రోజు మొత్తం కూడా మీటింగ్ ఉండొచ్చు. అంతసేపు పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చునే పరిస్థితి ప్రస్తుతానికి లేకపోవడం వల్లే ఆయన గడిచిన 3 క్యాబినెట్ సమావేశాలకు హాజరు కాలేకపోయారని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇదే అసలైన కారణం తప్ప , కూటమి మధ్య విబేధాలు వచ్చాయి అనడం లో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ కి కూడా జనసేన పార్టీ మంత్రులు హాజరయ్యారు. తదుపరి క్యాబినెట్ మీటింగ్ కి , ఆగస్టు 19 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆయన పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు ప్రత్యక్ష సమావేశాలకు హాజరు కావడం కష్టమే అని టాక్.