Homeక్రీడలుTeam India's Worst Failure: టీమిండియా ఘోర వైఫల్యం ఈ సూటి ప్రశ్నలు సంధించిన సచిన్...

Team India’s Worst Failure: టీమిండియా ఘోర వైఫల్యం ఈ సూటి ప్రశ్నలు సంధించిన సచిన్ టెండూల్కర్.. వైరల్

Team India’s Worst Failure: గతంలో ఎప్పుడూ లేని విధంగా భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. తొలి రెండు టెస్టుల్లోనూ ఓడిపోయి టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన భారత్.. వాంఖడే వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ ఓడిపోవడం జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. చిన్నపాటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. దాంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-3తో టీమిండియా వైట్ వాష్ కావాల్సి వచ్చింది. అందులోనూ స్వదేశంలో అత్యంత చెత్త రికార్డు కూడా ఇదే కావడం గమనార్హం. మరోవైపు.. పంత్ ఒంటరి పోరాటం చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు.

లక్ష్యం కేవలం 147 పరుగులే. పిచ్ కూడా స్పిన్‌కు చాలావరకు అనుకూలిస్తుంది. అటు భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో 9వ స్థానం వరకు ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్ సైతం ఉన్నారు. కేవలం సిరాజ్, అర్ష్‌దీప్‌లు మాత్రమే బౌలర్లు ఉన్నారు. ఈ స్థితిలో ఎవరూ కూడా భారత్ ఓడిపోతుందని అనుకోలేదు. రోహిత్, కోహ్లీలు ఒక్క మ్యాచ్‌లోనూ సరిగా ఆడలేదు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లో అయినా ఆడుతారని అనుకుంటే పెద్దగా సత్తాచాటలేదు. మూడో టెస్టులో అయినా గెలిపించి సిరీస్ ఓటమి బాధను దూరం చేస్తారని అభిమానులంతా అనుకున్నారు. కానీ, ఏం లాభం అలా జరగలేదు. 147 లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఒకరి తరువాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టింది. కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లను రాబట్టారు. పంత్ ఆడకపోయి ఉంటే భారత్ 100 పరుగులను కూడా సాధించకపోతుండే.

గతంలో 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో టీమిండియా సిరీస్ కోల్పోయింది. అదేవిధంగా 1980లో ఇంగ్లాండ్ చేతిలో 1-0తో వైట్ వాష్‌ అయింది. అలాగే.. 1983 తరువాత సొంత గడ్డపై మూడు టెస్టులు వరుసగా ఓడిపోవడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. తన కెరీర్‌లో ఇదే అథమ దశ అని, ఈ ఓటమికి సారథిగా పూర్తి బాధ్యత తనదే అని అన్నాడు. సొంత గడ్డపై సిరీస్ కోల్పోవడం జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు రాబట్టలేకపోవడం ఆందోళన కలిగించిందని ఉన్నాడు. ఈ సిరీస్ ఓటమి నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన మాకు అతిపెద్ద సవాలే అని చెప్పాడు.

కాగా.. టీమిండియా ఓటమిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సొంతగడ్డపై 0-3 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోవడం మింగలేని చేదు గుళికలాంటిదని పేర్కొన్నాడు. జట్టు మొత్తం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది అని అన్నాడు. సన్నద్ధత సరిగా లేకపోవడం వల్ల ఇలా జరిగిందా..? పేలవ షాట్ సెలక్షన్ దెబ్బతీసిందా..? లేదా మ్యాచ్ ప్రాక్టీస్ లోపించడం దీనికి కారణమా అని సచిన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నాడు. మ్యాచ్ ప్రాక్టీసులో లోపించడం ఏమైనా కారణం ఉందా అని తెలుసుకోవాలన్నాడు. శుభ్ మన్‌గిల్ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడను ప్రదర్శించాడు.. రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్సులో అద్భుతంగా ఆడాడు.. అతను సింప్లీ సూపర్బ్ అని కొనియాడాడు. భారత్ గడ్డ మీద భారత జట్టుపై 3-0తో విజయం సాధించడం న్యూజిలాండ్‌కు మంచి ఫలితమేనని చెప్పాడు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular