YS Vivekananda Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన నేత సోదరుడు, ప్రతిపక్షనేత బాబాయి, ఆపై మాజీ మంత్రి, మాజీ ఎంపీగా ఉన్న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు ఏడేళ్ల కిందట. పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయనను హత్య చేశారని.. సొంత వారి హత్య చేయించారంటూ ఆరోపణలు రావడంతో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. అయితే సుదీర్ఘకాలం దర్యాప్తు కొనసాగింది. ప్రాథమికంగా నిందితుల అరెస్టు కూడా జరిగింది. కానీ అసలు నిందితులు అరెస్ట్ జరగలేదు. వారిపై అనుకున్న విధంగా దర్యాప్తు ముందుకు సాగలేదు అనేది వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆరోపణ. తన తండ్రి చనిపోయిన విషయం అందరికంటే ముందు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తెలిసింది అనేది ఆమె వాదన. ఈ విషయాన్ని పక్కన పెడితే సిబిఐ దర్యాప్తు ముగిసిందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈడి ఎంట్రీ ఇవ్వడమే అసలు ట్విస్ట్.
* తేలని సూత్రధారుల విషయం..
ఇప్పటికే వివేకానంద రెడ్డిని ఎలా చంపింది? ఎలా కత్తిపోట్లు వేసింది? కత్తి ఎక్కడ కొనుగోలు చేసింది? అనే దానిపై నిందితుల్లో ఒకరు స్పష్టం చేశారు. ఎవరెవరు హత్య చేశారు? ఎవరెవరు పాల్గొన్నారు? అనే దానిపై పూర్తి స్పష్టత వచ్చింది.. కానీ అసలు సూత్రధారుల విషయంలోనే అనుకున్న విధంగా దర్యాప్తు సాగలేదు అనేది సునీత ఆవేదన. కేవలం రాజకీయ లబ్ధి కోసం భారీ సుఫారీ తో ఈ హత్య చేయించారు అనేది బహిరంగ రహస్యం. డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి ఇప్పుడు ఈడి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్లు సుఫారీ ఇచ్చారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న మాట. దానిని విచారణ చేపట్టేందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి, మిగతా వారి ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.
* అప్పట్లో అందని సహకారం..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సహకారం అందలేదు. సిబిఐ అధికారులు బెదిరింపుల బారిన కూడా పడ్డారు. అప్పట్లో ఒకసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో సిబిఐ వెనక్కి అడుగులు వేసింది. అయితే ఇప్పుడు ఈడి దూకుడు చూస్తుంటే మాత్రం కీలక ఆధారం లభించినట్లు తెలుస్తోంది. ఏకంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లతో పాటు కార్యాలయాల్లో తనిఖీలు చేయడం.. కీలక ఆధారాలు దొరకడం వంటి వాటితో అవినాష్ రెడ్డి అరెస్టు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..