YS Sunitha : కడప జిల్లాలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా పులివెందుల అర్బన్ సీఐ శ్రీరాం పై వేటు పడింది. ఆయనను వి ఆర్ కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీనికి కారణం వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. ఆమె ఓ విషయంలో సీఐ వైఖరి పై ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలకు ఉపక్రమించారు అధికారులు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒకవైపు ఈడి దూకుడు ప్రదర్శిస్తుండగా ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖ కూడా ఒక అధికారిపై వేటు వేయడం గమనార్హం. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇదే కలవరానికి కారణం అవుతోంది. కూటమి ప్రభుత్వంలో సునీతకు అంత పరపతి ఉందా? అనేది ఆ పార్టీ ఆందోళన.
* ఓ భూ వివాదంలో
వైయస్ వివేకానంద రెడ్డికి చిన్న రంగాపురంలో మూడు ఎకరాల 33 సెంట్లు భూమి ఉంది. 2011 నుంచి వివేకా భార్య సౌభాగ్యమ్మ ఆధీనంలో ఉంది. 2024 జనవరిలో వెబ్ ల్యాండ్ లో నకిలీ ఎంట్రీలు చేసి నలుగురు కలిసి తమ పేర్లపై ఎక్కించుకున్నారు. ఈ విషయంపై పులివెందుల ఆర్డీవో చిన్నయ్యకు వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే చర్యలకు ఉపక్రమించారు. నకిలీ పత్రాలతో పాటు పాస్ పుస్తకాలను రద్దు చేశారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పులివెందుల సిఐ శ్రీరామ్కు ఆర్డిఓ ఫిర్యాదు చేశారు. కానీ సదరు సీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కేసు లేకుండా రాజీ చేసుకోవాలని సూచించినట్లు సునీత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వీఆర్ వేటు పడింది.
* ఈడి ఎంట్రీ తో..
వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుదీర్ఘకాలం పోరాడుతూ వచ్చారు సునీత. దాదాపు సిబిఐ విచారణ క్లోజ్ అయినట్టే నన్ను ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఈడి దూకుడు కనబరుస్తోంది. ఈ హత్యలో ఆర్థికపరమైన అంశాలను తెలుసుకునే పనిలో పడింది. అందుకే సునీత పట్టువదలని విక్రమార్కురాలిలా పనిచేసింది అనేది స్పష్టమవుతోంది. అయితే ఈడి ఎంట్రీ ఇచ్చే వరకు సునీతకు కూటమి నుంచి పెద్దగా మద్దతు లేదని ప్రచారం సాగింది. ఎప్పుడైతే ఈడి ఎంట్రీ ఇచ్చిందో కేంద్ర పెద్దలు సైతం వివేకానంద హత్య కేసులో సీరియస్ గా ఉన్నారని అర్థమవుతోంది. ఇప్పుడు సునీత ఫిర్యాదుతో ఏకంగా ఒక సీఐపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్కు దిగిందంటే ఆమె పరపతి ఏ పాటిదో స్పష్టమవుతోంది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు అదే కారణం. మున్ముందు సునీత మరింత దూకుడుగా వ్యవహరిస్తారన్నది ఆ పార్టీ భయం.