Vijay Sai Reddy : విజయసాయిరెడ్డి గగ్గోలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ ప్రతిపక్ష నేతగా చెబుతున్నారు. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరిగాయని ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా హిందుత్వ వాదాన్ని వినిపిస్తున్న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. సరిగ్గా శ్రావణమాసంలోనే శుభ ఘడియలు చూసి తన నూతన పార్టీని ప్రకటించనున్నారు. అది కూడా హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే పార్టీగా తెలుస్తోంది.. హిందూ వాదం తోనే ధ్వనించేలా పార్టీ ఉండనుంది. అంతవరకు బాగానే ఉంది కానీ.. విజయసాయి రెడ్డికి వైసీపీలో ఉన్నప్పుడు ఈ మతమార్పిడులు గుర్తుకు రాలేదా? జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదా? ఇప్పుడే ఎందుకు వాటిని తవ్వుతున్నారు? అనేది ప్రశ్న. అయితే ఇప్పుడు హిందుత్వ వాదాన్ని వినిపించడం ద్వారా బిజెపికి దగ్గర కావాలన్నది విజయసాయిరెడ్డి ప్రయత్నం గా తెలుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి ఇప్పుడు మతమార్పిడిల అంశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తుండడాన్ని ఆ పార్టీ తట్టుకోలేకపోతోంది. ఆ పార్టీ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
* హిందూ వ్యతిరేక ముద్ర..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. పార్టీ పదవులు దక్కాలన్నా.. ప్రభుత్వం నుంచి పనులు జరగాలన్నా హిందూ మతాన్ని, ఆచారాలను బహిరంగంగా దూషించడమే అర్హతగా మారింది. కొడాలి నాని వంటి నేతలు హిందూ దేవుళ్ళపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఈ రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పార్టీలో గుర్తింపు పొందడానికి క్రైస్తవ మతంలోకి మారడం.. మతం మారినట్టు పై స్థాయికి నిరూపించుకోవడమే అప్పట్లో ప్రామాణికంగా ఉన్నట్లు సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానించే పరిస్థితి ఉంది. తాజాగా జోగి రమేష్ కుటుంబం పైనే అటువంటి ప్రచారం నడుస్తోంది. పైకి హిందూ మతాన్ని ఆచరిస్తూనే జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం క్రైస్తవ మతం స్వీకరించారన్నది వారిపై ఉన్న ఆరోపణ. గతంలో వైసీపీ హయాంలో ఒక్క మతానికి సంబంధించిన వాటికి నిధులు కేటాయించారు అనేది బహిరంగ రహస్యమే.
* అప్పుడేమయ్యారు..
అయితే ఇప్పుడు ఇదేదో తనకు తెలుసును అన్నట్టు వ్యవహరిస్తున్నారు విజయసాయిరెడ్డి. పది సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ అన్ని వ్యవహారాల్లోనూ కీలకపాత్ర పోషించారు. మరి అప్పుడు మతమార్పిడులు గుర్తుకు రాలేదా అనేది ప్రశ్న. అప్పట్లో మౌనంగా ఉండి.. సకల అధికారాలను అనుభవించిన విజయసాయిరెడ్డి.. ఇటీవల కాలంలో బహిరంగంగా మతమార్పిడులపై.. ఫైటింగ్ ఫర్ హిందూయిజం అంటూ కామెంట్స్ చేయడం.. పొలిటికల్ డ్రామా కాక మరేంటి. అయితే విజయసాయిరెడ్డి షేక్ హిందుత్వవాది అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు తిరిగి ఆరోపిస్తున్నాయి.