Vijaya Sai Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల గట్టి ఆరోపణలు చేశారు. తనపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని ఆరోపించారు. వైసీపీలో జరిగిన అవమానాలతోనే తాను బయటకు వచ్చానని వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనపై భౌతిక దాడి కూడా చేశారని.. అది కూడా జగన్ సమక్షంలోనే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మకద్రోహి అని ప్రచారం చేస్తున్నారని.. తాను నమ్మకద్రోహి అయి ఉంటే నాడే అప్రూవర్ గా మారేవాడినని చెప్పుకొచ్చారు. అప్పటినుంచి ఒకటే చర్చ ప్రారంభమైంది. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారితే ఏం జరుగుతుందనేది రకరకాలుగా విశ్లేషణ సాగుతోంది. ఆయన గాని అప్రూవర్గా మారితే అడ్డంగా బుక్కయ్యేది జగన్మోహన్ రెడ్డి. అంతలా ఒక వ్యవస్థీకృత నేరాలను అప్పట్లో పాల్పడ్డారు అన్నది ప్రధాన ఆరోపణ. దానికి అసలు సిసలు వ్యూహకర్త విజయసాయి రెడ్డి అన్నది ఒక వాదన. ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారితే కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు.
* ఒక సాధారణ ఆడిటర్..
నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి ఒక సామాన్య చార్టెడ్ అకౌంటెంట్. ఆడిటర్ గా మద్రాస్ లో ప్రాక్టీస్ ప్రారంభించిన విజయసాయిరెడ్డి.. వైయస్ కుటుంబానికి దగ్గరయ్యారు. రాజశేఖర్ రెడ్డి సీఎం కాక ముందు.. ఓ వివాహ వేడుకలో కలిశారు. అలా వారి మధ్య అనుబంధం పెరిగింది. వైయస్ కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు చూడడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారవేత్తగా మారడంతో విజయసాయిరెడ్డి అవసరం పెరిగింది. ఆయన కంపెనీలో జోక్యం కూడా పెరిగింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయసాయి రెడ్డికి ఎనలేని ప్రాధాన్యం దక్కింది. 2006లో ఆయనను టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా నియామకం జరిగింది. ఓరియంటల్ బ్యాంకు సభ్యుడిగా కూడా నియమించారు రాజశేఖర్ రెడ్డి సిఫారసులతో..
* వ్యవస్థీకృత నేరానికి వ్యూహకర్త..
అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకు పాల్పడ్డారన్నది జగన్మోహన్ రెడ్డి పై ఉన్న ప్రధాన ఆరోపణ. అక్రమాస్తుల కేసులు అందులో భాగమే. అప్పట్లో సొంత మీడియా ఉండాలని భావించిన రాజశేఖర్ రెడ్డి తన కుమారుడితో జగతి పబ్లికేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే ఒక వ్యవస్థీకృత నేరవ్యవస్థను రూపొందించారు. రూపాయి పెట్టుబడి లేకుండా జగతి పబ్లికేషన్స్లో షేర్లను అధిక ధరకు విక్రయించి లాభం పొందారు. సాధారణంగా ఒక షేర్ కొనాలి అంటే.. అది కూడా మీడియాకు సంబంధించిన సంస్థ షేర్ అయితే దానికి ఉన్న ప్రజాదరణ చూస్తారు. కానీ అప్పుడే పుట్టిన సాక్షి మీడియా షేర్లు వందల రెట్లు అధికంగా చెల్లించి కొనుగోలు చేశారు అంటే.. కచ్చితంగా దానికి మించి ప్రయోజనం అటు నుంచి ఉంటుంది. అలా ప్రభుత్వం నుంచి లాభదాయకమైన పనులు చేయించుకుని.. అదే సాక్షి మీడియాలో ప్రీమియం చెల్లింపులు అధికంగా చేసి క్విడ్ ప్రో కు పాల్పడ్డారని సిబిఐ గుర్తించింది. ఈ వ్యవస్థీకృత నేరానికి వ్యూహకర్త విజయసాయి రెడ్డి అని తేల్చింది.
* అంతా తానై..
విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటే అక్రమ ఆస్తుల కేసుల్లో నిందితుడు. ఆయనతో పాటే 16 నెలల జైలు జీవితం అనుభవించాడు. బయటకు వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆ పార్టీ ప్రతిపక్షం నుంచి అధికారం చేపట్టే వరకు అన్ని వ్యవహారాల్లోనూ ఉన్నాడు. ఇంత చేసిన తన విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరును తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి నోట అప్రూవర్ అనే మాట వస్తుండడంతో వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.