Pulivendula
Pulivendula: పులివెందుల( pulivendula).. ఈ పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేది వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆ కుటుంబానికి అడ్డాగా మారింది పులివెందుల. నాలుగున్నర దశాబ్దాలుగా ఆ కుటుంబం చేతిలోనే ఉంది పులివెందుల నియోజకవర్గం. కడప జిల్లాలో కూడా ఆ కుటుంబ ప్రభావం అధికం. అటువంటిది ఈ ఎన్నికల్లో పునాదులు మొత్తం కదిలిపోయాయి. పులివెందులలో సైతం జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గాను ఏడు స్థానాల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితుల్లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కానీ పులివెందుల నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం ఇప్పటికీ వైసీపీ హవా నడుస్తోంది. దానికి కారణం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలే. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఫలితంగా ఇక్కడ టిడిపి సంస్థాగతంగా బలోపేతం కాకపోగా.. పార్టీకి మరింత నష్టం జరుగుతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* అప్పట్లో కుప్పం పై ఫోకస్
2019 ఎన్నికల్లో వైసీపీ( YSR Congress ) ఘనవిజయం సాధించింది. 151 స్థానాల్లో గెలుపొంది తెలుగుదేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసింది. టిడిపి కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ కూడా తగ్గింది. అప్పుడే వైసిపి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కుప్పంపై. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. మునిసిపల్ ఎన్నికల్లో సైతం వన్ సైడ్ అన్నట్టు పరిస్థితి మారింది. నియోజకవర్గ ఇన్చార్జ్ భరత్ ను ఎమ్మెల్సీ చేసింది. ఆపై సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణ కొనసాగింది. ఒకవైపు రాజకీయంగాను, ఇంకోవైపు పాలనా పరంగాను కుప్పంపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది వైసిపి. చంద్రబాబు లాంటి సీనియర్ నేతనే ఇరుకునపెట్టే విధంగా అప్పటి వైసీపీ సర్కార్, ఆ పార్టీ నేతలు వ్యవహరించారు. అయితే అప్పట్లో వైసీపీ వ్యవహరించిన మాదిరిగానే.. ఇప్పుడు పులివెందులలో టిడిపి అనుసరించడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
* పట్టు బిగించిన బీటెక్ రవి
ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ పై( Jagan Mohan Reddy) పోటీ చేశారు బిటెక్ రవి. జగన్ మెజారిటీని తగ్గించగలిగారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతే ఇక్కడ విభేదాలు పెరుగుతున్నాయి. ఎన్నికల కు ముందు వైసీపీ హవాలో సైతం బీటెక్ రవి దూకుడుగా వ్యవహరించారు. చాలా రకాల కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు అధికారంలోకి రావడంతో అదే స్థాయిలో దూకుడు కనబరుస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తాను సైతం అన్నట్టు ముందుకు వస్తున్నారు. దీంతో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి.
*వినియోగించుకోలేకపోతున్న టిడిపి
ప్రస్తుతం పులివెందులలో( pulivendula) టిడిపి పట్టు బిగించే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు అవకాశం కూడా ఉంది. కానీ ఎందుకో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు టిడిపి నేతలు. అదే సమయంలో టిడిపి హై కమాండ్ పులివెందుల పై దృష్టి పెట్టడం లేదన్న విమర్శ ఉంది. కొద్ది రోజుల కిందట టిడిపి నేతల మధ్య గట్టి వార్ నడిచింది. ఇద్దరు నేతల అనుచరుల మధ్య ముష్టి యుద్ధం జరిగింది. అయినా సరే హై కమాండ్ ఎటువంటి దిద్దుబాటు చర్యలకు దిగలేదు. ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడలేదు. ఇలానే కొనసాగితే పులివెందుల నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పేలా లేవు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: There is criticism that the tdp high command is not focusing on pulivendula
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com