Hitesh Chenchuram: తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ఫ్యామిలీ బాగానే పనిచేస్తోంది. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పార్టీకి అధినేతగా ఉండగా.. మనవడు మంత్రి నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కుమారుడు బాలకృష్ణ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆపై హిందూపురం టిడిపి శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. ఇంకోవైపు ఆ ఫ్యామిలీ నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని సైతం యాక్టివ్ గా పని చేస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ మరో మనవడు హితేష్ చెంచురాం పొలిటికల్ ఎంట్రీ కి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలైనట్లు సమాచారం. హితేష్ చెంచురాం మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ పురందేశ్వరిల కుమారుడు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.
* అప్పట్లో వైరుధ్యాలు..
నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు తన ఇద్దరు అల్లుళ్ళు పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు. అయితే 1995 టీడీపీ సంక్షోభ కాలం తర్వాత.. 1999లో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆ ఫ్యామిలీలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. తోడల్లుడు చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరి విభేదించారు. అలా 2004 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా.. దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమంత్రిగా ఉండేవారు.. 2014 రాష్ట్ర విభజన పరిణామాలతో దగ్గుబాటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండిపోగా.. పురందేశ్వరి మాత్రం బిజెపిలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి పురందేశ్వరి బిజెపిలో కొనసాగుతూ వచ్చారు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.
* టిడిపిలోకి అందుకే..
మారిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుతో రాజీ కుదుర్చుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అటు పురందేశ్వరి సైతం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కారణమయ్యారు. రాజమండ్రి ఎంపీ గాను గెలిచారు. ఇప్పుడు అన్ని సంబంధాలు మెరుగుపడ్డాయి చంద్రబాబు కుటుంబంతో. నారా లోకేష్ విషయంలో కూడా సానుకూల దృక్పథంతో ఉంటారు పురందేశ్వరి. అందుకే తమ కుమారుడు హితేష్ చెంచు రాము ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలనేది దగ్గుబాటి దంపతుల ఆలోచన. దానికి సరైన వేదిక తెలుగుదేశం పార్టీ అని వారు భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. తద్వారా ఎంపీ గానో… ఎమ్మెల్యే గానో పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. అందుకే త్వరలో మంచి ముహూర్తం చూసి తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.