Homeఆంధ్రప్రదేశ్‌Janasena Party : గుర్తు లేని పార్టీ నుంచి.. ఈసీ ‘గుర్తిం’చేదాకా.. జనసేన ప్రస్థానం ఓ...

Janasena Party : గుర్తు లేని పార్టీ నుంచి.. ఈసీ ‘గుర్తిం’చేదాకా.. జనసేన ప్రస్థానం ఓ స్ఫూర్తి

Janasena Party :  మొన్నటి వరకు అదొక పార్టీయేనా అని ఎగతాళి చేశారు. గుర్తింపు లేని పార్టీగా అవమానించారు. అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయించి పార్టీ ఉనికిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇంతింతై అన్నట్టు ఆ పార్టీ పైకి ఎదిగింది. అవమానాలన్నింటినీ అధిగమించింది. అదే జనసేన. ఆ పార్టీకి శాశ్వత గుర్తింపుతో పాటు శాశ్వత గుర్తు కేటాయిస్తూ భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది.

* అనేక వివాదాల తర్వాత
జనసేనకు ( janasena )గుడ్ న్యూస్. ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం( Election Commission). గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తులు రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక లేఖ పంపింది. గత కొంతకాలంగా జనసేన గుర్తింపు తో పాటు పార్టీ సింబల్ విషయంలో వివాదం నడిచింది. కానీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన చోట్ల శత శాతం విజయం సాధించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది. సుమారు దశాబ్ద కాలం తరువాత జనసేనకు పూర్తిస్థాయిలో గుర్తింపు లభించినట్లు అయ్యింది. దీనిపై జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

* 2019లో దక్కని విజయం
2014లో జనసేన ను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో టిడిపికి, జాతీయస్థాయిలో బిజెపికి మద్దతు ఇచ్చారు పవన్. ఇక్కడ టిడిపి, అక్కడ బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసింది జనసేన. కానీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అటు పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సైతం వైసీపీలో చేరిపోయారు. దీంతో అసెంబ్లీలో జనసేనకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జనసేనకు గుర్తింపు లేకుండా పోయింది.

* కేవలం రిజిస్టర్ పార్టీగానే
అయితే ఈ ఎన్నికలకు ముందు జనసేన సింబల్ ( janasena symbol)విషయంలో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. అదే సమయంలో ఏపీ నుంచి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లో వైసిపి తో పాటు టిడిపికి మాత్రమే చోటు దక్కింది. జనసేన విషయానికి వచ్చేసరికి మాత్రం రిజిస్టర్ పార్టీల జాబితాలో మాత్రమే చోటు దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ సింబల్ గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలోకి వెళ్ళింది. అప్పట్లో జనసేన పోటీ చేసిన చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తారు. ఒకవేళ ఆ పార్టీ అభ్యర్థి లేకపోతే.. ఇండిపెండెంట్ కు అదే సింబల్ కేటాయించి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది ఈసీ. అయితే అప్పట్లో జనసేన న్యాయపోరాటం చేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

* శతశాతం విజయంతో
పొత్తులో భాగంగా జనసేనకు( janasena ) 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. అన్ని చోట్ల జనసేన విజయం సాధించింది. శత శాతం గెలుపుతో ఓట్లు, సీట్లు పెంచుకుంది. దీంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం గుర్తింపు గల పార్టీగా జనసేన ను గుర్తించింది. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది. దీనిపై జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి శాశ్వత గుర్తింపు దక్కడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular